top of page

చదువుల పంజరం

#UndavilliM, #ఉండవిల్లిఎమ్, #ChaduvulaPanjaram, #చదువులపంజరం, ##TeluguHeartTouchingStories


Chaduvula Panjaram - New Telugu Story Written By Undavilli M

Published In manatelugukathalu.com On 26/04/2025

చదువుల పంజరం - తెలుగు కథ

రచన: ఉండవిల్లి.ఎమ్


మబ్బుగా ఉంది. చిన్నగా వర్షం మొదలై, మధ్య మధ్య ఉరుముల్తో మేల్కొలుపుతున్నట్టుంది. 

చందు పరుగెడుతున్నాడు. వెంట ఎవరో తనని తరుముకొస్తున్నారు. ఇక తను దొరికిపోతాడానే భయం, ముందుకు పరుగెత్తడానికి దారిలేదు. వెనుక వెంట పడుతున్న ముసుగు మనుషులు. భయంతో ఉలిక్కి పడి లేచాడు. బయట మబ్బు వేసి ఉంది. కలై నందుకు ధైర్యం తెచ్చుకుని, బాటిల్ లో వాటర్ తాగి మళ్ళీ వచ్చి పడుకోబోయి టైమ్ చూసాడు. 


అప్పటికే ఐదు గంటలు కావొస్తుంది. 


వార్డెన్ వచ్చి లేపే సమయం ఐదు నిముషాలు ఉంది. ఇక నిద్ర పట్టలేదు చందూకి. రేపటి క్లాసులో నీట్ ఎగ్జామ్ కళ్ళముందు కదలాడింది. తను చదువుతున్నాడు. అయినా మార్కులు సరిగా రావడం లేదు. క్లాసులో లెసన్స్ అర్ధమయ్యి కానట్టుగా ఉంటున్నాయి. అదొక కార్పొరేట్ కాలేజ్, క్లాసులో అంత జనంలోను తిరిగి డౌట్స్ క్లియర్ చేసుకునే అవకాశం చిక్కడం లేదు. దూరంగా కూర్చోవడం ఒకటైతే, సిలబస్ అంటూ చెప్పుకుపోవడం మరొకటి. 


వార్డెన్ అందర్నీ లేపుతున్నాడు. అందరూ లేచారు. స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు, లేనివాళ్ళు పుస్తకాల ముందేసుకుని ఆరోజు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. 


చందు స్నానం చేసి, స్టడీ క్లాసులోకి వెళ్ళాడు. సీరియస్ గా పుస్తకాలు ముందేసుకున్న వాళ్లలో కొంతమంది, ఫోర్ జి మొబైల్ ఫోన్ సీక్రెట్ గా ఆన్ చేసి యూట్యూబ్ చూస్తున్నారు. కొంతమంది కునుకు పాట్లు పడుతున్నారు. 


ఎనిమిదిన్నరకి టిఫిన్ బ్రేక్, తర్వాత క్లాసులు మొదలయ్యాయి. కొన్ని క్లాసులు అయ్యాక, ఎగ్జామ్ కండక్ట్ చేశారు. మధ్యాహ్నం నుండి ఎయిమ్స్ పేపర్ టెస్ట్ పెట్టారు. 


ఈవెనింగ్ స్టడీ అవర్స్ లో డౌట్ క్లియర్ చేస్తుంటారు. విద్యార్థులు, వాళ్ళ ఎడ్యుకేషన్ స్టేటస్ ఇవేవీ వాళ్లకక్కరలేదు. మీదపడి రుద్దటం, రాకపోతే బట్టీ పట్టించేయడం, ఐ. పి. ఇ ఎగ్జామ్స్ కి చదువుతుంటే"అవి ఇంపార్టెంట్ కాదు, నీట్ కి ప్రిపేర్ అవండి(ఎన్. సి. ఇ. ఆర్. టి సిలబస్)ఆబ్జెక్టివ్ క్వశ్చిన్స్"అని చెప్తుంటారు


మొదట ముడ్నేళ్లలో వారానికోసారి పెట్టె నీట్ టెస్ట్ లో పెర్ఫార్మెన్స్ బాగున్న నూట ఏభై మందిని సెలెక్ట్ చేసి, వాళ్లకి చైనా బ్యాచ్ అని పేరు పెట్టి, వాళ్ళని సెపరేట్ గా వేరే క్యాంపస్ కి తీసుకెళ్లి ప్రత్యేకమైన కోచింగ్ ఇస్తుంటారు. ఈ కార్పొరేట్ కాలేజీ బ్రాంచీల్లోని ముందుగా జరిగే ఈ టెస్టల కీ మొబైల్ ఫోన్ ద్వారా సంపాదించి, మంచి మార్కులు సంపాదించి చైనా బ్యాచ్ లోకి వెళతారు కొందరు. మరికొందరు రికమండేషన్, లేదా మనీ పే చేసి దాంట్లోకి ప్రవేశిస్తారు. వీళ్లే రేపటి కాలేజీ ర్యాంకులు టీవీల్లోనూ, పేపర్లోనూ మోతెక్కడానికి దోహద పడేవారు. 


చందు మార్కుల మెసేజ్ లు ఇంట్లో వాళ్ళ మొబైల్స్ కి చేరిపోయి, అట్నుంచి ఫోన్స్, తిట్లు, రోజు విడిచి రోజూ పెట్టె నీట్ ఎగ్జామ్ ఓ గండం లా ఉంది చందూకి. 


కొంతమంది ఇవేవీ పట్టనట్టు, ఇంటర్ పాసైతే, ఎం బిబిస్ సీటు కొనుక్కోవవడానికి రెడీ అయిన వాళ్ళు, జల్సాగా తిరుగుతున్నారు. పేరుకే కాలేజీ స్ట్రిక్టు, కాలేజీ హాస్టల్ వెనుక సిగరెట్ ప్యాకెట్లు, కుప్పలుగా బీరుసీసాలు, ఇవేవి బయట ప్రపంచానికి తెలియని రహస్యాలు. 


లక్షల డబ్బుతో ప్రెస్టీజియస్ కోసం కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించేవారు కొందరు, అప్పోసోప్పో మెడిసిన్ చేయిస్తే బాగుంటుందని మరికొందరు, ఆనాక సీటు రాకపోతే, ఫీజుకోసం చేసిన అప్పులు, ఎడ్యుకేషన్ లోన్లు తీర్చలేక కుటుంబం అంతా అతలాకుతల మైపోవడం, ఇన్ని చేసిన తర్వాత సీటు రాకపోతే, పిల్లల మీద వత్తిడి తేవడం, అక్కడితో జీవితం అయిపోయినట్లు దిగాలు పడిపోవడం, దానికి తగ్గట్టు గానే రాసేవాళ్ళు లక్షలమంది, సీట్లు వేలల్లో, సీట్లు రానివారంతా చదవని వారని కాదు, ప్రభుత్వ వైఫల్యాల వల్ల కొంతమందికే పరిమితమైన సీట్లు. 

మధ్యలో సెలవులొచ్చాయి. అందరూ ఇంటికి వెళ్లిపోయారు. చందు కూడా ఇంటికి వచ్చాడు.


చందు లో ఇంతకు ముందు లాంటి హుషారు లేదు. బెరుకు, భయం చందుని కమ్మేసాయి. చదువు, క్లాసు, టెస్ట్లు తప్ప మరో ప్రపంచం తెలీని ఓ పరిస్థితిలో అయోమయంగా కొట్టుమిట్టాడుతున్నాడు. ఆట, పాట, బంధువులు, స్నేహితులు ఏమిలేని లోకంలా, మనుషుల్లోంచి విడివడి, అన్నిటికీ దూరంగా యంత్రంలా మారిపోయాడు తను. ఇది కాకపోతే మరేవి లేనట్టు, ఇది రాకపోతే జీవితం చేజారిపోయినట్టు, అంతా సూన్యం, ఇంట్లో వాళ్ళ అజ్ఞానం కొంత, ఈ కాలేజీ బాగోతాలు కొంత, మెడిసిన్ కాకపోతే, బైపీసి నుంచి పది పన్నెండు కోర్సులు ఉన్నాయి. కానీ, వత్తిడి, ఆందోళన భరించలేకపోతున్నాడు తను. కార్పొరేట్ కాలేజీలో వాళ్లిచ్చే తర్ఫీదు కూడా విద్యార్థిని మార్కుల మిషన్ లా తయారు చేయడం, ఇంట్లో వాళ్ళ ప్రవర్తన జీవితంలో ఇదో తప్పని సరి ప్రక్రియలా భావించడం. 


నానాటికి దిగజారిపోతున్న మార్కుల గ్రాఫ్ తో, ఇంటినుండి, కాలేజీ నుండి వత్తిడి ఎక్కువైంది. ఎన్నో రకాల మాటలు మనసుని తూట్లులా పొడుస్తున్నాయి. 


ఆ సంవత్సరం ఎంసెట్ క్యాన్సల్ అయి, నీట్ రావడంతో అంతా తారుమారైంది. ప్రభుత్యం మెడిసిన్ కి ఎంసెట్ తీసేసి, నీట్ పెట్టడంతో ఐ. పి. ఇ ఎగ్జామ్స్ కి స్టేట్ సిలబస్, నీట్ కి సి. బి. ఎస్. సి సిలబస్ చదవడం ఇంటర్ విధ్యార్దులకి ఓ దూరదృష్టవరం. 


చాలా మంది రెండూ ఫాలో అవలేక వెనక్కి తగ్గిపోయిన వాళ్ళు, చదవలేక ఏదొక దాని దగ్గర ఆగిపోయిన వాళ్ళు, నీట్ ఎగ్జామ్ లో మైనస్ మార్కులుంటాయని భయపెట్టే లెక్చరర్లు, అంతా అయోమయం. విద్యార్థుల జీవితాలు కార్పొరేట్ కాలేజీల వ్యాపారంలో పావులై పోయాయి. 

దసరా సెలవులకి ఇంటికెళితే, చందుని సైక్రియాట్రిస్ట్ కి చూపించి, వేలకి వేలు పోసి ట్రీట్మెంట్ చేయించారు. ఇదివరకటి కంటే కొంచెం నయం, చదవని వైనా జాగ్రత్తగా అర్ధం చేసుకుని, స్టోర్ చేసుకోగల్గుతున్నాడు. ఎంత చదివినా తరగని సిలబస్, మరోపక్క అర్ధం కాని ఫిజిక్స్ తో మరో తంటా. 


హాయిగా బతకలేని తన జీవితాన్ని చీకటి కోణంలోంచే చూసి, బెంబేలు పడిపోతున్నాడు. ఏదో తెలియని టెన్షన్, ఏమి జరుగుతుందో, జరగడానికి అవకాశం ఎలా వస్తుందో ఆలోచించడానికి సమయం లేని పరుగు.. మార్కుల పరుగులు.. 


ఇదివరకటిలా కలివిడిగా ఉండటం లేదు. గదిలో మూలన లైటు ఆర్పేసి కూర్చోవడం, ఎవ్వరితో మాట్లాడకపోవడం, పిచ్చిగా మూర్ఘత్వంగా ప్రవర్తించడం, ప్రతి చిన్న మాటకి పెద్ద పెద్ద అర్ధాల్ని తీసుకుని, వ్యతిరేఖంగా మాట్లాడటం ఇవన్నీ చందులో కొత్తగా వచ్చిన లక్షణాలు. 


టెన్త్ వరకు ఇంట్లో ఉండి బాగా చదివాడు. ఇంటర్లో దూరంగా హాస్టల్ లో పెట్టి చదివిస్తే, బాగా చదువుతాడని, సాక్రిఫైస్ చేసి చదివించినా అక్కడా మార్కులు రావడం లేదు. ఇంటికి ఎవరొచ్చినా, ఫంక్షన్స్ లో ఎవరు కలిసినా వాడి మార్కులు గురించి అడగటం, సలహాలు ఇవ్వడం, అందరి పిల్లలు బాగా చదువుతున్నారు, మన పిల్లాడు ఎందుకు చదవడం లేదు? ఆ పిల్లల గురించి చెప్తుంటే వీళ్ళ బుర్ర పిచ్చెక్కిపోవడం, కర్ణుడి చావుకి అనేక శాపాలు కారణమైనట్టు, చందు పరిస్థితికి అనేక అంశాలు కారణమవుతున్నాయి. 


చందు మేనమామ వినయ్ అక్కద్వారా విషయం అంతా తెలుసుకున్నాడు. అక్కకి నచ్చజెప్పాడు “చదివితే ఎదో అయిపోవాలని, అదే పట్టుకుని కూర్చోడం కాదక్కా, వేరేదేమైనా చదివించు, సైంటిస్ట్ ని చేయి, అబ్దుల్ కలాం గారు మెడిసిన్ చేసి, అంతలా ఎదిగారా? వాళ్ళు ఏది చేయగలరో దాంట్లో ప్రోత్సహించడమే కరెక్ట్, మీరు అనవసరంగా అతిగా ఆలోచించి, వాడ్ని భయపెట్టి, ఎదో చేసేలా ఉన్నారు" అన్నాడు. 


వాళ్ళక్క మౌనంగా ఉండిపోయింది. వాళ్ళ బావగారు అర్ధమయినట్టు, ఒప్పుకోలేక పోతున్నట్టు ముఖం పెట్టి చూస్తున్నాడు. 


“సరే అక్కా, నేను కూడా హాస్టల్ కి వెళ్ళి చందూని కలిసి ఎంకరేజ్ చేసి చెప్పి వస్తాను" అన్నాడు. 


మర్నాడు -

చందుని కలిసి అనునయంగా అన్నీ అడిగాడు. ఎక్కువ సమయం చదవలేకపోవడం, అర్ధంకాకపోవడం, నిద్రలేమి సమస్య, ఎన్నున్నా పరుగెత్తించడం, ఇవన్నీ విన్నాకా “సరే, నువ్వెంత వరకూ చడవగలవో, అంతవరకు పెర్ఫెక్టుగా చదువు, ఒత్తిడికి లోనయి చదవకు, మమ్మీ, డాడీలతో నేను చెప్తాను" అని చెప్పేసి వచ్చేసాడు. 


మర్నాడు జరిగిన నీట్ పరిక్షలోను చందు మార్కులు తక్కువొచ్చాయి. కాలేజీ వాళ్ళు పరుగెత్తించే పరుగులతో మనసు పిచ్చెక్కిపోయింది. స్టడీ అవర్స్ కి వెళ్లకుండా రూములో ఒంటరిగా ఉండిపోయాడు. వార్డెన్ చెక్ చేయడానికి వచ్చాడు. కొంచెం ఫీవర్ గా ఉండి రాలేదని చెప్పాడు. 


వారం తర్వాత -

హాస్టల్ లో చందు కనబడ్డం లేదని మెసేజ్ వచ్చింది. ఇల్లంతా ఉలిక్కి పడింది. హాస్టల్ కి కారులో వచ్చేశారు. పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. 


వాళ్ళూ వీళ్ళూ చెప్పే స్టూడెంట్స్ సూసైడ్ విషయాలు గుర్తొచ్చి, వినయ్ ని పట్టుకుని భోరున ఏడ్చింది నీరజ" అనవసరంగా ఒత్తిడి తెస్తున్నాం, ఇంకొకటి చదువుకున్నా, నీట్లో ర్యాంక్ రాకపోతే పోయేదేముంది. నాకొడుకు నకుండేవాడు. ఏమయ్యాడో దేవుడా!" అంటూ కింద పడి పొర్లుతుంది. “వాడికి వచ్చింది, చడవగలిగింది చదివితే, మాకు ఈ పాట్లు ఉండేవి కావు, నా కొడుకు నాకు దక్కితే చాలు" అంటూ రాగాలు తీస్తుంది. 


భర్త రవీందర్ ధైర్యంగా ఉన్నట్టు కనబడుతున్నా, లోలోన కుమిలీకుమిలి నలిగిపోతున్నాడు. 

అన్ని పోలీస్ స్టేషన్లకి మెసేజ్ వెళ్లింది. రవీందర్ కి తెలిసినవాళ్ళు, స్నేహితులు, బంధువుల ఇళ్ళకు మనుషుల్ని పంపించి వెతికించారు. టీవీలో కూడా చందు గురించి న్యూస్ వచ్చింది. 

ఇంటికి పరామర్శలు ఎక్కువయ్యాయి. అందరూ ఓదారుస్తున్నారు. కొందరు ధైర్యం చెప్తున్నారు. సలహాలతో కొందరు. ఇళ్ళంతా బంధువులు, స్నేహితుల్తో బిజీ అయింది. 


నీరజ మౌనంగా ఉండిపోయింది. ఏమీ మాట్లాడబుద్ధికావట్లేదు. ఎవరేమి చెప్పినా చెవికి ఎక్కడం లేదు. అందరిలాగే తనూ గొప్పగా చెప్పుకునే కొడుకులా అవ్వాలని భావించింది. మరో దాంట్లోనైనా, కొడుకుని గొప్పగా తయారు చేయొచ్చని ఇప్పుడనిపిస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, దుఃఖం ఆగడం లేదు. ఇంట్లో తామే ఒత్తిడితో నలిపేసి, ఇలాంటి పరిస్థితికి కారణమయ్యావనే విషయం ఆమెని దొలిచేస్తుంది. పదేపదే జ్ఞాపకమొచ్చి, శోషొచ్చి పడిపోతుంది. మళ్ళీ లెగుస్తుంది. కళ్ళలో వత్తులు పెట్టుకుని, జ్ఞాపకాల్ని మనసులో వెలిగించి, తనివి తీరా మౌనంగా, దీర్ఘాలోచనలో పడిపోతుంది. 


కొడుకుతో పాటు, ఆమె ప్రవర్తన చూసి భర్త కుదేలైపోతున్నాడు. వినయ్ వాళ్ళక్కని ఓదారుస్తున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా తోడుగా అక్కడే ఉన్నారు. 

వారం గడిచాక -

సడెన్ గా ఇంటిముందు పోలీస్ జీపు ఆగింది. దాన్లోంచి కానిస్టేబుల్స్ చందుని ఇంటి లోపలికి తీసుకొస్తున్నారు. ఎస్ఐ గారు వెనకాల వస్తున్నారు. ఇంట్లో అందరూ అవాక్కయ్యారు. గుమ్మం దాటి బయటి వరండాలోకి వచ్చారు. 


“క్రిష్ణానది బ్రిడ్జికింద అనుమానస్పదంగా తిరుగుతుంటే, పట్టుకుని ఎంక్వయిరీ చేసి తీసుకొచ్చాం" అంటూ ఎస్ఐ గారు చెప్తున్నారు. 


చందు మౌనంగా ఉండిపోయాడు. నీరజ కొడుకుని తడుముకుని చూసుకుంది. “ఏంట్రాయిది" అంటూ చందుని పట్టుకుని వలవల ఏడ్చింది. 


“సారీ మమ్మీ, ఎవరు కనబడినా, పలకరించినా మార్కుల గురించే అడుతున్నారు. నీట్ ఎగ్జామ్ జరిగితే, మీనుండి ఫోన్ వస్తే సమాధానం చెప్పడానికి భయంగా ఉంటుంది. రోజూ ఉదయం ఐదు గంటల నుండి, రాత్రి పన్నెండు వరకు పరుగులు, ప్రశాంతంగా ఉండలేక పోతున్నాను. ఎదో టెన్షన్, మామూలుగా కష్టపడి చడవగలను, కానీ, నన్ను బందించినట్టు, నేనేమో ఉక్కిరి బిక్కిరవుతూ చదవడం, రోజులు తరబడి నేను భరించలేక పోతున్నాను. నాకెందుకో ఆ రోజు అదోలా అనిపించింది. ఇవన్నీ వదిలేసి వెళ్లిపోవలనిపించింది. దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనిపించింది. తప్పో, ఒప్పో నాకు తెలియదు. ఇవన్నీ రోజూ నేను తట్టుకోలేకపోతున్నాను. దానితోపాటు మీ గురుంచి బెంగొకటి" అంటూ నీరజను చుట్టేశాడు. 


అందరిలాగే మేమూ ఆలోచించాం పిల్లల్ని ఎలా చదివించాలనే ఆశలు మాకు కూడా ఉంటాయి. ఒక్కోసారి అభిరుచులు వేరై, అనేక స్థితిగతులు కారణమై, అనుకున్న దానికి విరుద్ధంగా జరుగుతుంటాయిరా! అనుభవం రానిదే జ్ఞానం పూర్తిగా వికసించదు. మా కళ్ళెదుటే ఉండి, నువ్వు ఏం చదవాలనుకుంటున్నావో, దాన్నే పట్టుదలగా చదువు, అదే పదివేలు మాకు, నువ్వు కనబడకపోతే ఈ అమ్మ ఉండగలదేంట్రా" అంటూ నీరజ కిందకి జారగిలబడిపోయింది. 

“హాయిగా నాకు నచ్చినట్టు చదువుకోకుండా, అందరితో కలవని, బంధీఖానా లాంటి హాస్టల్ లో నన్ను ఉంచొద్దొమ్మా, ఇక్కడే ఉండి చదువుకుంటాను. ఈ సంవత్సరం కాకపోతే, మరో సంవత్సరం రాసి నీట్ ర్యాంక్ తెచ్చుకుంటాను. రాకపోతే మరోటి చదువుతాను. నన్ను ఇక్కడే ఉండనీయండమ్మా, అక్కడికెళ్ళాలంటే భయంగా ఉందమ్మా" అంటూ వాళ్ళమ్మ కాళ్ళని చుట్టేశాడు. 


రవీందర్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తాము తప్పు చేసినట్టుగా పశ్చాత్తాపపడ్డాడు. 

“మీ కలల్ని, ప్రతిష్టల్ని కాపాడుకోవడం కోసం, అవన్నీ పిల్లల మీద రుద్దకండి. ఏ నవ్వు ఎలా వికసించి పరిమళిస్తుందో అలాగే ఉండనీయాలి. సహజాన్ని చేరిపేసి, కృత్రిమంగా మారిస్తే, సహజ అందం పోయి, ఆందోళనతో కూడిన జీవితం కళ్ళముందు పరుచుకుపోతుంది జాగ్రత్త!" అంటూ ఎస్ఐ గారు బయటకి నడిచారు. 


ఆయనతో పాటే వినయ్ బయటకి నడచి, గేటు వరకు వెళ్ళి వాళ్ళని సాగనంపాడు. నీరజ, రవీందర్ లు ఆయన మాటల్ని మళ్ళీమళ్ళీ రిపీట్ చేసుకుంటూ, ఆయన వెళ్లినవైపే చూస్తుండిపోయారు.

౼ఉండవిల్లి. ఎమ్



సమాప్తం. 

 ౼౼౼౼౼

ఉండవిల్లి.ఎమ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: ఉండవిల్లి.ఎమ్

ఇప్పటి వరకు వివిధ దిన, వార, మాస, పక్ష, రేడియోలలో కలిపి 150 కథలు, 200 వరకు కవితలు వచ్చాయి. 

'శిధిల స్వరాలు ' కవితా సంపుటి, ' అంకితం ' కథా సంపుటి, నిశ్చల నవల, ' ఒక దేహం - అనేక మనసులు ' నవలలు పుస్తక రూపంలో వచ్చాయి. 

 నిశ్చల నవల, అంకితం కథా సంపుటి కన్నడంలోకి అనువాదం అయ్యాయి. 


చాలా కథా, కవిత సంకలనాల్లో కథలు, కవితలు వచ్చాయి. 

 అనేక మనసుల్ని కథల్లో, నవలల్లో దృశ్యమానం చేయడం ఇష్టం! 


Comments


bottom of page