top of page

ఈటి నోటిముసర పెరికిందెవరు?

Updated: Oct 11, 2023

'Eati Noti Musara Perikindevaru' New Telugu Story

Written By Endapalli Bharathi

రచన : ఎండపల్లి భారతి


మా ఊర్లో పతి మంగళారం సంత జరుగుతుంది. వారమంతా కష్టం చేసిన డబ్బులకి సంతకు పోయి సరుకులు తెచ్చుకుంటేనే కూర్లకు యసనముండదు. అయినా కాలం మారి డైలి మార్కెట్లు, రైతుబజార్లు,సూపర్ మార్కెట్లు ఎన్నొచ్చినా మాకుమటుకు సంత ఒగ తిరనాల్లాంటిది. మాచేతిలో దుడ్లున్ని కాడికి ఎక్కడో ఓ సోట మాసొమ్ముకు తగ్గ బేరం వుండనే వుంటుంది . బేరగాలు దగ్గర గోజాడి, గోజాడి మనం అడిగిన రేట్లకు వాల్లు సరుకు అమ్మితే ఆ ఆనందం,ఆ బింకం బలేవుంటుంది.ఇంగ మాఊర్లో వారంవారం కచ్చితంగ సంత చేసే వాల్ను సావుకార్లు అంటారు.


ఈ మంగళారం నేను ఇంటి సరుకులు సగలం తెద్దామని మూడునూర్లు దీసుకుని సంతకు పోతి. సరుకులన్నీ దీసుకోని ఆ సంచిని చేత్తోనే మోస్కోని బస్టాండికి వచ్చేసరికి చేతులు ఎర్రగా కమిలి పొయినాయి.భుజానగాని నెత్తినగాని పెట్టుకుంటే ఎంతబరువైన మోయచ్చు. కాలం మారె. నెత్తినగాని పెట్టుకుంటే యాడ మొరుటోల్లు అనుకుంటారేమోనన్నజంకు.సంచి నాకాళ్ళకు ఆనిచ్చుకొని నేను నిలబడితి. ఆడ నాకుబాగా జతగత్తె,మాఊరి ఆడబిడ్డ కమల కూడా బస్సుకోసం బస్టాండ్ లోవుంది. నేనుదాని పక్కకు చూసి నగతా అంచుకుపోయి కమలా బాగుండావా అంటి.అది మూతిముడ్సుకొని తలకాయి పక్కకు తిప్పుకుండ్యా. మల్లా నేనే మాట్లాడిస్తి. అదివుండుకోని "మ్మేయ్ నేను నీతో మాట్లాన్ను,నాకొడుకు పెండ్లికి నీ ఇంటికొచ్చిసెబితే కూడా నువు రాలా.నేనంటే నీకు లెక్క జమలేదు. నీబిడ్ల పెన్నిండ్లకు కూడా నేనురాను" అని బాదపడే . నీనుండుకోని "మ్మేయ్ మాపరిస్థితి బాగలేదు.నేను డేటు అయింటి. ఆపొద్దుటికి నాకు రెండుదినాలు. నామొగుడు మడికాడ కోతులకి కావిలుండాడు. మడికాడ గెడిసేపు కూడ యామారేదానికిలేదు. నోటికొచ్చిన పంటపోతుంది అని దానికి నచ్చజప్తి .ఆటికీ అది సరిగా మాట్లల్లా, ఆయాలకే దాని బస్సొచ్చే.అదిఎక్కిపాయ.నేనూ మాఊరుబస్సుకి ఇంటికి వొచ్చేస్తి.


ఇంటికి వస్తానే కమలన్నమాటలు నామొగినితో చెబితి. నామొగుడుండుకోని "ఈడ కోతులతో గెడి సేపుకూడా నిమ్మలం లేదే , పొద్దుపుట్టి పొద్దుగుంకి పొద్దుమసికిలు పడేవరకు కావిలుండల్ల.యామారి నామంటే పచ్చికాయి, పాలకాయి, చెట్లుతోసహా పెరికేస్తాయి.ఏమిచేసేది. అందరితోను నిస్టూరం కట్టుకోనే పనై పోయింది. ఈ కోతులతో ఒగపెండ్లికి పోలేము,ఒగసావుకిపోలేము,ఎవరికన్నా ఆప్తి అంటేపోలేము. గోతికాడనక్కేగతం కాస్కో నుండే పనైపోతాంది అనే"


అవును నామొగుడు చెప్పింది నిజం. కోతుల గొడవ ఒకటేనా మాకు. పంట చేస్తే దానికి ఎన్ని ఆసించు కొని ఉంటాయో ! మా యట్ల చిన్న సేద్య గాళ్ళు అరకవ నీళ్లకు మడి నాటితే మల్లల్లో ఎలకలు. మాకు వాటితో రంపు చిన్నది కాదు. నీకే కాదు ఈ భూమిలో మాకూ అక్కుంది అని దౌరుజన్యంగా మేము మడి నాటతున్నబుడే మా కంటే ముందుగానే గెనాల్లో వాటి ఇండ్లు కట్టుకునే దానికోసం బొక్కలు లోడుకుంటా ఉంటాయి. అవి మనకంటే కస్టజీవులు.పదినిమిషాలు తిండి తిన్నాయంటే పది గంటలు పని చేస్తాయి.మనమెట్లా ఇంకోఇంటి కంటే మేటుగా ఇల్లు కట్టల్ల నుకుంటామో అట్లా ఆ ఎలుకలకుకూడా పోటీ. ఒకదాన్ని మించి ఒకటి మడి గెనాల్లో సొరంగాలు తవ్వుతాయి.గదులు గదులుగా లోడతాయి.మేము నాట్లు పెట్టే గుందికి అవి ఇండ్ల పని మొదలు పెడతాయి అవిటి కట్టడం లో యాడన్న డ్యామేజీ అయి బొక్కలు పడితే మా మల్లోని నీల్లన్నీఎలిపోతాయి.అబుడు చూసి ఆబొక్క తొక్కి పూడ్సల్ల. మడి ఎన్నులు ఇడిసేటబుడు వొరికర్ల మొదల్లు తీయగ ఉంటాయని వాటిని కొరకతాయి.


గింజలు అట్ల ముదరతానే ఆ వడ్ల గొలకల్ని నోటితో కొరికి ఎత్తుకపోయి వాటి బొక్కల్లో అంటే వాటి ఇండ్లల్లో పెట్టుకుంటాయి. పొదుపు అనేది ఎట్లా చేయాలా అనే విషయం ఎలకల దగ్గరే నేర్చుకోవల్ల .మల్ల సంవత్సరం వరకు తిండికి బయం లేకుండా వొడ్ల గొలకలు ఎత్తుకుపోయి పెట్టుకుంటాయి.బీదోల్ల పైకి షావుకార్లు దౌర్జన్యం చేసినట్లు మేము వాటి బొక్కలు కనుక్కొని దౌర్జన్యంగా తవ్వి పగలగొట్టి చూస్తే అవి ఎత్తి పెట్టిన ధాన్యంగింజలు కనబడతాయి. ఆ బొక్కల్లో పాములు దూరి వాట్ని సంపితే తప్ప వాటి తిండికి ముప్పు రాదు. అవి ఎత్తి పెట్టిన తిండి గింజలు సంవత్సరం తర్వాత చూసినా సెడి ఉండవు అంత బాగుంటాయి . అప్పుడు ఇర్లోల్లు ఎలుకల్ను బట్టేవాళ్ళు .ఎలకల్ని పట్టే బుట్టల్లో గింజలేసి వాటిని మల్లో పెడతారు. ఆ గింజల కోసం ఎలకలొచ్చి ఆ బుట్టలో పడి ఇరుక్కు పోతాయి. ఒక ఎలక్కి ముప్పైరూపాయలు ఈయల్ల .అది ఒక పని.మల్ల ఊదర పెట్టేది.బొక్క లో పొగ పెడితే ఆ పొగకు ఊపిరాడక బయటకొచ్చేస్తాయి. అట్ల పట్టుకొని చంపేది. అట్లా పంటను మేము ఎలకల నుండి ఎంత కాపాడినా అవిటి వాటా అవి దోసుకుంటానే ఉంటాయి .


ఇవిటి గొడవ ఇట్లుంటే పందులువొగ పక్క. ఇవి సానా తెలివైనవి. పొగులు రావు.సరిగ్గా నడి జామకాడ వస్తాయి. ఇవి పంట లో పన్నాయంటే, పెద్దలంటారు చూడు పంది పొల్లినట్లుపొల్లాడి దొర్లతా ఉండావు అంటారే అట్లా చిత్త, చిత్తగా తొక్కేసి తినేసి పొల్లాడి ఎలి పోతాయి. అవి రాకుండా మడి సుట్టూ కమ్మి కట్టల్ల. గుడ్డ తిరుకులు సుట్టు కట్టల్ల. బెదుర్లు పెట్టల్ల.దానికోసం మనిషిబొమ్మ చేసి నిలబెట్టేది . ఇప్పుడు ఇంగా కాలం మారి పులి ఎట్లా ఉంటే అట్లా బొమ్మలు సిక్కతా ఉండాయి కదా ఆ పులి బొమ్మ తెచ్చి నిలబెట్టేది. దానికి పులి అరుపు గాండ్రించిన ట్లు అలారం పెట్టేది, డప్పులు కొట్టేది . ఇట్లా వాటిని బెదర కొడతాము .


ఇంగా గువ్వలు, పక్షులు అవి ఎంత సుకుమారంగా సున్నితంగా ఉంటాయో అవిటి పనితనం కూడా అట్లే ఉంటుంది, " ఒక కథ ఉంది వొక రాజుని శని దేవుడు ఎంటాడతా ఉంటాడు. అన్నీ పోగొట్టుకోని తిండి దొరక్క అకిలికి అలమటిస్తా ఉంటే ఒగ గువ్వల గుంపు వచ్చి కూసుందంట ముందర . వాటినన్న తిందామని వొంటి మింద ఉన్న ఒగేఒగ పంచి గుడ్డ ఇప్పి వాటిపైన ఏస్తే అవి ఓగే కట్టుగా ఆ పంచిగుడ్డతో సహా ఎగిరిపోతాయంట. బిత్తల తో నిలబడి ఆకులు కట్టుకునే స్తితివచ్చే ఆ రాజుకి.అట్లా పంట వొడుపుకువచ్చినబుడు యామారినామంటే యాభై, నూరుగువ్వలు గుంపులు గుంపులుగా వచ్చి పొట్టు కూడ రాల్సకుండా నోటితో సున్నితంగా బీముగింజలు తినేసి ఊదేస్తాయి.ఇవి పొద్దన సాయంత్రం వస్తాయి. ఎండ పొద్దు లో రావు.అవి వచ్చే టైముకు దేవునికి మెరివిని తిరిగినట్లు అన్నంతినే గిన్ని చిన్నకట్టి ఎత్తుకొని డాంగ డాంగ మంటూ కొట్టుకుంటూ వూడ్ వూడ్ మని అరసల్ల. ఎంత చేసినా వాటి వాటా వాటికి పోతుంది. వీటినన్నిటిని జయించి ముందుకు పోతే దేవుడు కూడా పగ పడతాడు.వాన పడక పంటలు ఎండిపోతాయి లేదంటే వానపడి మునిగి పోతాయి. ఇవన్నీ కనికిరించి పంట ఇల్లు చేరి మా సట్లో పడే వరకు మాకు పురిటి నొప్పులే.


సరే ఇవిటి గొడవంటే ముందు నుంచీ అలవాటయ్యింది .కానీ ఇప్పుడు కొత్తగా కోతుల బెడద వచ్చి పడింది.


మేము పది కుంటల్లో టమాటల పంట ఏసినాము. మాభూములు సుటకారం పెద్దపెద్ద మాండ్లు ఉండాయి. కోతులు మా మాండ్లుని వాటికి స్తావరాలు చేస్కునాయి. ఎంతదేశం తిరిగినా కూడ సాయంత్రానికి ఇండ్లకు ఒచ్చినట్లు మాండ్ల మిందకు ఒచ్చేస్తాయి. అది ఒగటి, రెండుకాదు, గుంపులుగుంపులు వొస్తాయి. ఒగొగ గుంపుకి యాభై కోతులుంటాయి. ఒగగుంపు పోతే ఇంగో గుంపు వస్తాయి. ఒగ గెడివి యామారినా మా పంటంతా పెరికి నేలమట్టం చేసేస్తాయి. అనే వుండ్ల "ఒగకోతి వనమంతా చెడిసనంటారే" అట్లా ఈ కోతుల రావిడి ఎక్కువై ఈటి గురించి మాఇంట్లో ఎన్నోదినాలు రంపు లాడుకున్నాము. నేను కోతుల కాడికి పోతే వాట్నినేను తోల్లేను. అవి నామిందకు ఎగరబారతాయి. నేను పోను బయిపడి . నామొగినికి యాస్ట అయినబుడు గాని, ఏదైనా పని పన్నబుడుగాని, ఇంట్లో పిల్లోల్లని లేక నన్నుగాని పొమ్మంటే మేము పోకపోతే ఆయనకి బలే కోపం వస్తుంది. మడికాడికి పోతే మాటాడే దిక్కులేకుండా ఊరికే కుసోవల్లంటే బేజారయేది. అందుకే మేము పోమనేది.మాకు జైలుసిచ్చి అయిపోయింది ఆడ . వాటిని తరమల్లని మేము చేయని పనిలేదు. టపాసులు కాల్సేది, డప్పులు కొట్టేది, అగ్గి పెట్టేది ఇట్ల ఏమిజేసినా అవికొమ్మలపైకి పొయ్యి అవి కుసున్న కొమ్మను ఊపతా ఆటినుండి మమ్మల్నే కండ్లతోను, పొండ్లుతోను బెదిరిస్తాయి. మేముతెగబడి కొట్టేదానికి దేవుడనే భయము.


మొన్న నామొగుడు కాంచేపు పనుందని పంటకాడ లేకుండా యామారినాడు. ఈసందులో కోతులు జొరబడి కాయల్నిపెరికి,అన్నీపీకి పీకి నేలపాలు చేస్నాయి. పెరికిన కాయని తినేస్తే పర్వా లేదు అట్లకాదు కాసింత కొరికేది అది పారేసి ఇంగొగకాయ కొరికేది.అదిచూసి నామొగుడు కోపంపట్ట లేక కట్టి ఇసిరేసినాడు. ఒగకోతి తలకాయికి తగిలింది.మిగతావన్నీతప్పించుకున్నాయి. ఆ కోతి ఆన్నేపడిపోయింది. ఆ పడిపోయిన కోతిని చూసి నామొగినికి బాదేసింది. అదరాబదర పరిగెత్తి పోయి ఏట్లో నుండి బక్కిట్టుతో నీల్లు ముంచకచ్చి దానికి తాపినాడు. అయినా అది కదల్లేదు.దాని మెడంతా రక్తం కారతాఉంది. ఓరే ఇదేమొ చచ్చేట్టిగావుంది కోతిని చంపితే కోటిపాపాలు అంటారు. "ఇవిటి దిక్కుఆర్నాని!


పంట తినేసి పోతే పోనీ ఈ కర్మయాల అనుకోని దిగులుపడిపోయినాడు.ఆ కోతికి దెబ్బతగిలే కుందికి మిగిలిన కోతులన్నీమాండ్లెక్కేసి అరస్తా దానికల్లా చూసుకోనుండాయంట.అన్నీయాడ నామింద ఎగరబారతాయోనని ఇంటికొచ్చి జరిగింది మాకుచెప్పి అన్నం ఎత్తుకొని బొయ్యి ఆ కోతికి పెట్టినాడు.అది తినిండ్ల. ఆ యన్నాన్ని మిగిలిన కోతులు తిన్నాయి.సాయంత్రం మల్లా అన్నం ఎత్తకపోయి పెట్టినాడు. అబ్బుడు అదికొంచం అన్నం తిని తెపుర్లుకునింది. ఆ కోతి లేసి తిరుగులాడేంతవరకు మిగిలిలిన కోతులు ఒగ పొగులు రేయి మేత నీల్లు లేకుండా దాని సుటకారం కావిలున్నాయి.ఆమర్సునాడు అన్నీఊర్లోకి వొచ్చేసినాయి.


ఊర్లో మద్యానం మూడుగంట్లు అయ్యింటుంది. గెట్టిగ అరుపులు ఇనపడ్యా. నేను ఈది లోకి పోయి నిలబడితి. ఊర్లోని ఆడోల్లంతా కట్లెత్తుకొని కోతుల్ని తరమతావుండారు. వీల్లజతకి మొగోల్లు కుక్కలు కూడా ! నేను వాల్లగుంపులో నిలడితి. మా వొదిన ఉండుకోని"మాఇంట్లో కోన్ని పొదగ బెట్టింటే ఆ పొదిగినకోడి మేతకుపోయింటే ఆ గుడ్లు ఎత్తకచ్చి తినేసె. ఇల్లంతా గుడ్లు పగలగొట్టేసినాయి. రేపోమాపో పిల్లలు ఇడగతయి ఆ గుడ్లు.ఆ పొలుసు వాసన పోవలంటే నేనుఎంతసేపు కడగల్లో.ఈటిని దేవుల్లంటారే,దేవుల్లు అయితే గుడ్లు తింటాయా అనే" ఇంగోయమ్మ "మాఇంట్లోకూర,అన్నం తినేసి సామాండ్లన్నీ పీకేసినాయి.నా మనవరాలు చిన్నబిడ్డ.ఇంట్లోవుంటే ఆ బిడ్డ మిందకు ఎగరబారింటే బయంతో జరం వొచ్చేసింది. మాతమ్ముడు తలుపుతెర్సుకోని పనుకోనుంటే సడిసప్పుడు లేకుండ ఇంట్లోకి పోయి సామాండ్లన్నీ పీకతా వుండాయంట.వాడులేసిఅరిస్తే అట్లే జొరబడి వానికాలు కర్సింది. వాడు మనూరి రెండుగంట్ల బస్సుకు గవర్నమెంట్ ఆసుపత్రికి బాయె " అనే .


ఇగ మాఆడబిడ్డ వాల్లది పూరిల్లు. పైకప్పడం పేరికేసి ఇంట్లోకి జొరబన్నాయి. ఇంట్లోవున్నఉప్పునుండి నూన్డ్లు , మసాలడబ్బాలు, సామాండ్లు మెత్తం నేలపాలు చేసేసినాయి. అదిఇంటి కొచ్చిచూసి బోరున ఏడిసింది. ఊరందరి ఇల్లలో జరిగిన దానికంటే మా ఆడబిడ్డ లచ్చిమికి జరిగిందానికే అందరు బాద పడినారు. ఎందుకంటే దానిమొగినికి కాలు అవుటు. దానిరెక్కల కష్టంతోనే ముగ్గురు బిడ్డల్ని,సంసారాన్నినెట్టు కొస్తా వుంది.ఈనష్టం పూడాలంటే దానికి రెన్నెల్లు పడుతుంది.


మా చిన్నబుడు ఊర్లోకి కోతులాడించేవాళ్లు వస్తావుండ్రి . ఆ కోతికి నిక్కర చొక్కాయి తొడిగి, సోకుజేసి, ఆ కోతిని బుజాన ఎక్కిచ్చుకొని చేతిలో పొడువాటి కట్టితో ఇంటింటికీ పొయ్యేది. అమ్మా సీతమ్మఅత్తింట్లోలు ఎట్లాంటోల్లుఅంటే అది అలిగేది.తలకాయికిందికి వాలేసెది. పుట్టినింటోలు అంటే అదినగేది. సలాంకొట్టేది. పిల్లాగుంతలు ఆడేది.పిల్లోలమంతా ఆ కోతులోడు ఊరు దాటకున్నంత వరకు ఆయప్పయనకాలే పోయేది. ఆకోతిచేస్టలకు పగలబడి నగేది. కోతిని జూస్తే అంత అపురూపంగా ఉండేది.చూడక చూడక కోతిని చూసే వాళ్ళం.అట్లుండేది అబుడు. ఇబుడు సుమారు పదేండ్లయ్య, ఊర్లమింద కోతులనెత్తుకొని వచ్చి .


మాయమ్మ వాల్ల అన్న వుండ్యా . ఆ యప్పకు బిడ్లు లేరు. ఆలు మొగుడు ఇద్దరూ మన్సుల్ని నమ్మరు.వాల్ల బిడ్లేగతం మూడునాలుగు కుక్కలు,మేకలు యాబై, పిల్లులు ఐదారు ఉన్నాయి . అవిఇల్లంతా తిరిగేది అరిసేది.చిన్నబిడ్లేగతం వాల్ల కాల్ల సుటకారం తిరిగి కాల్లకు అడ్డం పడేవి. కొత్తోల్లు ఎవురన్నావాల్ల ఇంటికి పోతే వాట్నిచూసి చీకొట్టుకొనేది. వాల్లు తినేగిన్నెలోవాటికి అన్నం పెట్టేది . అదీ మించితే వాటికి తినిపిస్తా అదేచేత్తో వాళ్లుతినేది. నేను ఏంది మామా ఈ సంత అంటే "అయ్యోమ్మ అట్లనద్దు దేవుడు ఈ బూమ్మింద పుట్టిన జీవికల్లా దాని నోటి ముసర దానికి ఏసే ఉండాడు. వాటికి ముసర లేకుండ సేయగూడదు"అనేవాడు.


మా యన్నఉండుకోని ఈ కోతుల్ని చూస్తే బాదేస్తుంది. అవిమాత్రం ఏమిచేస్తయి. పొలిం మింద యాడేగాని మేతలేదు.అడువులు పలసబారి పోయినాయి.వాన్లులేక,నీల్లు లేక, తిండి దొరక్క అవి ఊర్లమింద బడ్డాయి.పెద్దలు అనేవుండారు 'దేనినోటి కూడన్నాపెరికేస్తే అవి మననోటికూడు పెరికేస్తయి' అని అదియిదే అనే . నిజమే ఈ కోతుల దెబ్బకి భయపడి సానామంది సేద్యాలు చేయకుండా బూములు బీల్లు పెట్టుకోనుండారు.


అయినా మేము చేసిన తప్పేమి ? మేము సెట్లు కొట్టలేదు, మేము ప్యాక్టరీలు కట్టలేదు, మేము రోడ్ల మీద పెద్ద పెద్ద పొగ బండ్లు నడప లేదు, మేము సెరువులు సదరం చేసి బిల్డింగులు లేపలేదు, దేశమంతా ఎడతెరపు లేకుండా కరెంటు తీగలు నాట లేదు. మేము చేసిందల్లా ఆ బూమిని దున్ని నాలుగు రకాల తిండి గింజలు పండించి నలగరి కడుపులు నింపడం ఒకటే . మాకు దెల్సి మేము దేని నోటి ముసరా పెరక లేదు."నీ కులానికి నాసాడు అంటే తలా గెంటెడు అన్నట్లు" మనిషి చేసేపనులకి బూమి మీద పుట్టిన సాటిమనిసులతోపాటు నోరులేనిజీవాలు కూడా పలితం అనుబవించాల్సిందేనా ?



************************************

అర్థాలు

ముసర = నోటికాడికి పొయ్యేది ఏదైనా, నోటికి మెత్తుకునేది

మసికిలు = చీకటి

పొలుసు వాసన = నీసువాసన

బెదుర్లు = బెదిరింపు

గుడ్డ తిరుకులు = గుడ్డ పేలికలు

కాలుఅవుటు= కాలు అవిటి

బిడ్లేగతం = బిడ్ల మాదిరిగా

మెరివిని తిరిగినట్లు=ఉరేగింపులాగా చుట్టూ తిరిగేది

************************************





Comentarios


bottom of page