top of page

ఘటమయ్య తెలివి

Writer's picture: Mukkamala JanakiramMukkamala Janakiram

#MukkamalaJanakiram, #ముక్కామలజానకిరామ్, #GhatamaiahThelivi, #ఘటమయ్యతెలివి, #TeluguMoralStories, #నైతికకథలు

వారం వారం బహుమతుల పథకంలో ఈ వారం ఉత్తమ కథగా (29/12/2024) ఎంపికైన కథ


Ghatamaiah Thelivi - New Telugu Story Written By Mukkamala Janakiram

Published In manatelugukathalu.com On 23/12/2024

ఘటమయ్య తెలివితెలుగు కథ

రచన: ముక్కామల జానకిరామ్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పారిజాత రాజ్యానికి రాజు విజయుడు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ స్వయంగా పరిష్కార మార్గాలు చూపేవాడు. దానితో విజయుడు అంటే ఆ రాజ్య ప్రజలందరికీ అమితమైన గౌరవం. 

 మందార రాజ్యానికి రాజు ముకులుడు. ఇతడు ఎన్నో రాజ్యాలను ఒంటి చేత్తో జయించాడు. ఇంతటి వీరుడిపై విజయుడు విజయాన్ని సాధించడంతో గర్వం పెరిగింది. 


 మందార రాజ్యంపై విజయం పొందిన నాటి నుండి విజయుడు రాజభవనం నుండి బయటకు రావడం మానేశాడు. చిన్న చిన్న సమస్యలు తన దృష్టికి వచ్చినా పట్టనట్లు ఉండేవాడు. ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవడానికి వస్తే భటులు ముఖ ద్వారం వద్దే ఆపేసేవారు. చేసేదేమీ లేక ప్రజలు నిరాశతో వెనుదిరిగేవారు. 


 ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి దోపిడీ దొంగలకు చేరింది. వారు ఇదే అదునుగా భావించారు. 

 ఒకరోజు అడిమయ్య అనే పశువుల కాపరి మందను మేపడానికి బండపాలెం గుట్టపైకి పశువులను తోలుకెళ్లాడు. నల్లటి ముసుగులను ధరించిన దోపిడీ దొంగలు అడిమయ్యను బెదిరించి ఆంబోతులను తోలుకెళ్ళారు. పక్క అంగడిలో అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. విజయుడికి ఫిర్యాదు చేయడానికి పరిగెత్తుకొచ్చిన అడిమయ్యకు నిరాశే ఎదురైంది. ముఖ ద్వారం వద్దే రక్షకభటులు ఆపేశారు. బాధతో దుఃఖిస్తూ ఇంటికి చేరుకున్నాడు. 


 మరుసటి రోజు పాపయ్య అనే గొర్ల కాపరి గొల్లగుట్ట పైకి గొర్రెలను మేపడానికి వెళ్ళాడు. నల్లటి ముసుగులను ధరించిన దోపిడి దొంగలు పాపయ్యను బెదిరించి పొట్టేళ్లను తీసుకెళ్లారు. రాజ మందిరానికి పరుగెత్తుకెళ్లిన పాపయ్యకి నిరాశే మిగిలింది. 


 క్రమ క్రమంగా పారిజాత రాజ్యంలో దొంగతనాలు, దోపిడీలు పెరిగాయి. ప్రజలంతా కష్టాల్లో కూరుకుపోయారు. రాజుపైన ప్రజలకు ద్వేషం కూడా పెరగసాగింది. 


 ఒక సాయంత్రం అడిమయ్య, పాపయ్య రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుండగా.. వాళ్ళ స్నేహితుడైన ఘటమయ్య అక్కడికి వచ్చాడు. ఘటమయ్య కుమ్మరి. కుండలను బాగా చేయగల నేర్పరి. చుట్టుపక్కల ప్రజలంతా అతని వద్దకే వచ్చేవారు. మిత్రులను చూసి ఏమి జరిగిందిరా! దిగాలుగా ఉన్నారు "అని ఆరా తీశాడు. వారు జరిగిన సంగతినంతా చెప్పారు. 


 "కొన్ని రోజులు ఓపిక పట్టండి. మీ సమస్యలకే కాదు, మన రాజ్య ప్రజలు పడే సమస్యలకూ పరిష్కారం దొరుకుతుంది. రాజు గారికి తెలిసేలా చేస్తాను" అని మిత్రులకు హామీ ఇచ్చాడు. 

 "ఒరేయ్.. ఘటమయ్యా!గారితో చెలగాటమా! ప్రాణాలకే ప్రమాదమని" హెచ్చరించాడు అడిమయ్య. 

 "నా గురించి మీరేం కంగారు పడకండి. నా దగ్గర మంచి ఉపాయం ఉంది" అని బదులిచ్చాడు ఘటమయ్య. 


 వేసవికాలం రావడంతో ఒక మంచి కుండను తయారు చేయమని వారం రోజుల క్రితమే విజయుడు తన భటులను పంపి ఘటమయ్యతో కుండను తయారు చేయించుకొని రమ్మని కబురు పంపాడు. 

 "ఇదే మంచి సమయం" అని భావించిన ఘటమయ్య కుండను తీసుకెళ్లి రాజు సింహాసనం పక్కన పెట్టి దానిలో నీరు పోసి ఉంచాడు. మూడు రోజుల తర్వాత ఆ కుండ నుంచి నీరు ఒక్కొక్క చుక్కగా కారి సింహాసనం కిందకు నీరు చేరింది. అది చూసిన రాజు గారికి ఆవేశం కట్టలు తెంచుకుంది. వెంటనే ఘటమయ్యను బంధించి తీసుకు రమ్మని ఆజ్ఞాపించాడు. భటులు ఘటమయ్యను బంధించి తీసుకొచ్చారు. 


 "ఘటమయ్యా!కుండలు చేయడంలో నైపుణ్యం గలవాడివని నీకు అప్పగిస్తే.. నాసి రకం కుండను తయారు చేస్తావా?"అని కనులెర్ర జేశాడు. 


"మహారాజా ఆగ్రహించకండి. ఆ కుండకు ఉన్నది చిన్న రంధ్రమే. కానీ మీ సింహాసనాన్ని తడిపేసింది. అలాగే మన రాజ్యంలో చిన్న చిన్న సమస్యలే పెద్ద సమస్యలుగా మారి ప్రజలంతా భయ భ్రాంతులతో బతుకుతున్నారు. దోపిడీ దొంగల ఆగడాలు పెరిగాయి. తప్పుగా మాట్లాడితే మన్నించండి ప్రభూ!" అని అక్కడే నిలబడిపోయాడు ఘటమయ్య. 


 ఆలోచనలో పడిన విజయుడు "ఘటమయ్యా! నీ మాటలతో నా కళ్ళు తెరిపించావు. నీ ధైర్యానికి అభినందిస్తున్నాను "అని ఘటమయ్యను సన్మానించి నగదును బహుమతిగా ఇచ్చి పంపించాడు. 

 ఆ రోజు నుండి విజయుడు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ.. దోపిడీ దొంగల భరతం పట్టాడు. ప్రజలంతా సంతోషించారు. ఘటమయ్య తెలివికి, సాహసానికి ప్రజలంతా మెచ్చుకున్నారు. 

 ***


ముక్కామల జానకిరామ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: ముక్కామల జానకిరామ్ M. A., B. Ed., D. Ed


స్కూల్ అసిస్టెంట్- తెలుగు

నల్గొండ జిల్లా

తెలంగాణా




 
 
 

3 comentarios


Raghu jhansi sanvic Varshitha blocks

1 day ago

🎉

Me gusta

JR Musical Beats

1 hour ago

🎉

Me gusta

R Musical Beats

2 hours ago

Super

Me gusta
bottom of page