కాకి కావాలి
- Srinivasarao Jeedigunta
- Jan 31, 2023
- 3 min read

'Kaki Kavali' New Telugu Story
Written By Jidigunta Srinivasa Rao
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
సుబ్బారావు, వెంకటేష్, మూర్తి ముగ్గురు అన్నదమ్ములు. మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు.
సుబ్బారావు పెద్దవాడు అవడం తో పదిహేను సంవత్సరాల నుండి తల్లితండ్రుల తద్దినం పెడుతున్నాడు. మొదటిలో సెరమనీ కి అయ్యే ఖర్చు ముగ్గురన్నదమ్ములు సమంగా భరించేవాళ్ళు. అయితే ఏమైందో కానీ, సుబ్బారావు తమ్ముళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోకుండా ఖర్చు మొత్తం తనే భరించేవాడు.
అన్నగారింటికి వెళ్లి, తద్దినం పెట్టే వాడి తమ్ముళ్లలా వుండకుండా, ‘యిన్ని సంవత్సరాలనుండి అన్నగారు తల్లిదండ్రుల తద్దినం పెడుతున్నా, ఒక్కసారి కూడా కాకి పిండాన్ని కాకి వచ్చి తినలేదు’ అని తమలో తామే మాట్లాడుకోవడం, సుబ్బారావు భార్య విని, మొగుడికి చెప్పింది. ‘పదివేలు ఖర్చు పెట్టి యింత శ్రద్దగా మీరు మీ తల్లిదండ్రుల తిధి పెడుతున్నా, మీ తమ్ముళ్లు ఒక్క పైసా ఖర్చు పెట్టక సరికదా, మీరు తిధి పెట్టడం మీ తల్లిదండ్రులకి యిష్టం లేదని, అందుకే కాకి వచ్చి పిండం ముట్టడం లేదని అనుకుంటున్నారు’ అని చెప్పింది.
దానితో మనసు పాడైన సుబ్బారావు, తమ్ముళ్ళని పిలిచి “యిహనుంచి తల్లిదండ్రుల తిధి ఏడాది కి ఒకరి యింట్లో పెడదాము, దానివలన మీరు కూడా తల్లిదండ్రుల ఋణం తీర్చుకున్నట్టు అవుతుంది” అని అన్నాడు.
అన్నగారి మాటలకి తెల్లబోయిన వెంకటేష్, మూర్తి సరే అని ఒప్పుకున్నారు.
సంవత్సరం గడిచింది. రెండు రోజులలో తండ్రి తిధి వెంకటేష్ యింట్లో పెట్టాలి. వెంకటేష్ కి నిద్రపట్టడం లేదు, ఖర్చు పెట్టడానికి సిద్దమైనా, ఒకవేళ తిధి నాడు కాకి రాకుండా వుంటే ఎలా? నిన్నటి వరకు అన్నగారిని అక్షేపించినట్టు, యిప్పుడు తనని కూడా అనుకుంటారు అనుకుని, తమ్ముడు మూర్తి కి ఫోన్ చేసి, తన భయం చెప్పాడు.
“నిజమే, ఈ హైదరాబాద్ లో కాకులు ఎక్కడివి రావడానికి, ఇన్నాళ్ళు అన్నయ్య ని ఆడిపోసుకున్నాము” అన్నాడు మూర్తి. చివరికి ఒక ఉపాయం అలోచించి, స్కూటర్ మీద అబిడ్స్ లో పక్షులు అమ్మే అతని దగ్గరికి వెళ్లి, ఒక కాకిని అద్దెకు తీసుకుని తిధి వరకు ఆ కాకికి గోడ మీద అన్నం ముద్ద పెట్టి అది తిని మళ్ళీ వచ్చేవిధంగా ట్రైనింగ్ యిచ్చే విధంగా ఒప్పించుకుని వచ్చారు.
ఒప్పుకున్న విధంగానే కాకి యజమాని వచ్చి ట్రయినింగ్ యివ్వడం, తను కూడా కడుపునిండా తినడం జరిగింది.
అనుకున్న రోజు వచ్చింది. తమ్ముడి ఇంటికి భార్య, పిల్లలతో చేరుకున్నాడు సుబ్బారావు.
“కాకి పిండం ఎక్కడ పెడదాం అనుకుంటున్నావు?” అని అడిగాడు తమ్ముడిని.
“యింకా పూజ కాలేదు. అప్పుడే కాకి పిండం ఏమిటి అన్నయ్యా, అదిగో ఆ చెట్టు దగ్గర గోడ మీద పెడతాను. అయినా నేను అంటే నాన్నకి యిష్టం. కాకి రూపంలో వచ్చి కాకి ముద్ద యిట్టే ఎగరేసుకుపోతాడు” అన్నాడు అన్నగారితో వెంకటేష్.
ముందే సుబ్బారావు తన కొడుకు కి చెప్పి వుంచాడు, బాబాయ్ అన్నం ముద్ద తీసుకుని గోడ మీద పెట్టినప్పుడు, నువ్వు ఏదైనా కాకి వస్తే మేడమీద నుంచి ఆ కాకిని బెదరకోట్టు అని.
కాకి వాడు కాకిని వదుల్తాడు అని తమ్ముళ్లు, కాకి వస్తే తోలేస్తాడని సుబ్బారావు ఎవరి ధీమా లో వాళ్ళు వున్నారు.
శాస్త్రి గారు వచ్చి, తంతు మొత్తం కానిచ్చి అన్నదమ్ములు ముగ్గురిని వాళ్ళ గ్లాసులు పట్టుకొని బయటకు వస్తే తర్పణాలు ఇద్దురు గాని అని బయటకు నడిచాడు.
వెంకటేష్ తన తమ్ముడికి చెప్పాడు కాకి ముద్ద గోడమీద పెట్టిరమ్మని. తను తన గ్లాస్ తీసుకుని, దానిలో వెండి చెంచా వేసుకొని తండ్రికి తర్పణం యిచ్చి, కాళ్ళు కడుగుకోవడాకనికి ట్యాప్ దగ్గరికి వచ్చాడు.
కాకి ముద్ద మూర్తి గోడ మీద పెట్టడం, దానికోసమే ఎదురుచూస్తున్న కాకి యజమాని కాకిని వదలడం, అది రివ్వున వస్తోవుంటే సుబ్బారావు కొడుకు చాటునుంచి కాకి మీద రాయి విసరడం జరిపోయాయి.
అన్నం ముద్దవైపు అలవాటు ప్రకారం వెళుతున్న కాకికి, రాయి దూసుకు రావడం తో రూట్ మార్చి, వెండి చెంచాని ముక్కుకి కర్చుకుని ఎగిరి పోయింది.
కాకి మీద నమ్మకం లేక, కాకి యజమాని గోడ వెనుక నుంచి చేతితో గోడమీద వున్న కాకి ముద్ధ ని లాగేసి జేబులో వేసుకున్నాడు.
యిది గమనించని మూర్తి, “అన్నయ్యా! కాకి వచ్చింది” అని అరిచాడు.
“కాకి ముద్దతో పాటు వెండి చెంచా కూడా పట్టుకుపోయింది” అని బాధగా మూలిగాడు వెంకటేష్.
“పోనీలేరా, కాలం మారింది. నాన్నకి కూడా తినటానికి స్పూన్ కావలిసి వచ్చినట్టుంది” అని సుబ్బారావు అన్నాడు.
మొత్తానికి ఎవరి దారిన వాళ్ళు వెళ్లిన తరువాత వెంకటేష్ అబిడ్స్ వెళ్లి కాకి యజమాని తో తగాదా పెట్టుకున్నాడు. వాడు ఎదురు తిరిగి, “నా కాకి యింతవరకు తిరిగి రాలేదు, మీరే వెయ్యి రూపాయలు యివ్వాలి” అని చివరికి అయిదు వందలు తీసుకుని వెంకటేష్ ని వదిలిపెట్టాడు.
అక్కడ వున్న పంజరం నుంచి కావ్ కావ్ అని వినిపించింది వెంకటేష్ కి.
....... శుభం...
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Commentaires