top of page

క్షీరసాగర మథనము - 11

Writer: T. V. L. GayathriT. V. L. Gayathri

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 11 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 22/02/2025

క్షీరసాగర మథనము - 11 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి



ఇక క్షీరసాగర మథనము - 11 చదవండి..


69.

తేటగీతి.


గరళపానంబు జేయగా పరమశివుని

కరమునుండి జారిన విష కణిక లపుడు 

వృశ్చికంబుల జాతులై వృద్ధి చెంది 

పుడమి యందున విషమును వెడలగ్రక్కె.//


తాత్పర్యము :


పరమశివుడు గరళమును చేసేటప్పుడు ఆయన చేతి నుండి జారిన విషకణములు జారి పడి తేళ్ల వంటి విషపు జాతులై పుడమిలో పుట్టాయి.//


70.

తేటగీతి.


ఉద్ధతించి దేవాసురులుప్పతిల్లి

జయ జయమని పల్కుచు సాగుచుండి

సాగరంబును మథియించ శక్తితోడ

కామధేనువు ప్రభవించె కలిమినీయ.//


తాత్పర్యము :


దేవదానవులు మరలా శక్తి కొద్దీ పాలసముద్రమును చిలుకుతూ ఉంటే ఆ పాల సముద్రంలో నుండి అన్ని కోరికలు తీర్చే కామదేనువు అనే దేవతాగోవు పుట్టింది.//



71.

తేటగీతి.


వేల్పుటావును గ్రహియించి వేడ్కతోడ

మునిగణంబులు భక్తితో మ్రొక్కుకొనిరి

యజ్ఞధేనువై వెలుగొంది యధ్వరమున

కోర్కెలన్నియు తీర్చునీ గోవు నిలిచి.//


తాత్పర్యము :


ఆ కామధేనువును ఋషిగణాలు తీసికొన్నాయి. వారికి యజ్ఞములకు కావలసిన పదార్థాలనన్నిటినీ ఆ గోవు సమకూరుస్తుంది.//


72.

తేటగీతి.


శ్వేతవర్ణంపు నశ్వంబు చిందులేసి

వచ్చె నుచ్ఛైశ్రవంబుగ వార్థినుండి

బలి పరిగ్రహించె పరమ భక్తితోడ

నసురజాతికి నైశ్వర్య మందెనపుడు.//


తాత్పర్యము :


మరియు ఆ పాలసముద్రములో నుండి ఒక తెల్లని గుర్రము పుట్టింది. దాని పేరు ఉచ్ఛైశ్రవము. దానిని దైత్యరాజైన బలిచక్రవర్తి తీసికోవటంతో రాక్షసులు చాలా సంతోషించారు.//



73.

తేటగీతి.


పిదప కలశాబ్ధి నురగల విచ్చుకొనుచు

దేవగజరాజు పుట్టగన్ దిక్కులందు

వెలుగు వెల్లువై చిందగా వేడ్కతోడ

శక్రు డైరావతంబును సంగ్రహించె.//


తాత్పర్యము :


ఆ తర్వాత ఆ పాలసముద్రము నుండి 'ఐరావతము 'అనే తెల్లని ఏనుగు పుట్టింది. దానిని దేవతల రాజైన ఇంద్రుడు తీసికొన్నాడు.//


74.

తేటగీతి.


నాల్గుదంతములొప్పగ నడిచివచ్చు

శ్వేతవర్ణంపు గజముకు శిరము వంచి

ప్రాంజలించిరి దేవతల్ భక్తిమీర

స్వర్గధామము చేరెనా సంపదపుడు.//


తాత్పర్యము :


ఆ తెల్లని ఏనుగు ఐశ్వర్యానికి గుర్తు.ఆ ఏనుగుకు దేవతలందరూ మ్రొక్కారు. అటువంటి ఆ ఏనుగు స్వర్గాన్ని చేరింది.//


75.

తేటగీతి.


కలశరత్నాకరమునుండి కౌస్తుభంబు

వెలికి వచ్చెను దివ్యమై వెలుగు జిమ్మి

వరదుడౌ హరి గ్రహియించి వక్షమందు

నిల్పుకొనగమణి మెరిసె నిగనిగనుచు.//


తాత్పర్యము :


ఇంకా దేవదానవులు ఆ పాలసముద్రాన్ని చిలుకుతూ ఉంటే' కౌస్తుభము'అనే మణి వెలుగులు జిమ్ముతూ వచ్చింది. దానిని శ్రీహరి తీసికొని తన హృదయంపై అలంకరించుకొన్నాడు.//


76.

తేటగీతి.


పారిజాతంబను తరువు ప్రాభవించి

భూషణంబుగ దివియందు పొలయుచుండి

భోగభాగ్యంబు లీయగా పొంగిపొరలి

సంతసించిరి దివిజులు సంబరముగ.//


తాత్పర్యము :


ఆ పాలసముద్రము నుండి పారిజాతమనే వృక్షము పుట్టింది. అది ఎక్కడ ఉంటే అక్కడ భోగభాగ్యాలు ఉంటాయి. దేవతలందరూ సంబరంతో ఆ వృక్షాన్ని స్వర్గానికి తీసుకొనిపోయారు.//


77.

తేటగీతి.


అప్సరాంగనామణులెల్ల నబ్ధినుండి

నాట్యమాడుచు వచ్చిరి నగవుతోడ

సుందరాంగులు దివ్యమౌ శోభలెగయ

స్వర్గలోకమున్ జేరిరి సంభ్రమముగ.//


తాత్పర్యము :


ఆ తర్వాత పాలసముద్రము నుండి అప్సరసలు పుట్టారు. వారు నాట్యమాడుతూ వచ్చి, స్వర్గాన్ని చేరుకున్నారు.//



టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




 
 
 

Comments


bottom of page