top of page

క్షీరసాగర మథనము - 12

Writer: T. V. L. GayathriT. V. L. Gayathri

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 12 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 12/03/2025

క్షీరసాగర మథనము - 12 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి



ఇక క్షీరసాగర మథనము - 12 చదవండి..


78.

వచనము.


శ్రీమహాలక్ష్మీదేవి యావిర్భావము./


తాత్పర్యము.


పాలసముద్రము నుండి శ్రీమహాలక్ష్మీదేవి పుట్టుట.


79.


చంపకమాల.


చిఱుచిఱు హాసముల్ జిలికి శ్రీకరమౌ సిరి దృశ్యమానమై

మెరిసెను కోమలాంగి తన మేనున శోభలు నివ్వటిల్లగా

సరసుహ నేత్రి సౌరుగని స్థాణువులైరట లోకులెల్లరున్

వరములనిచ్చు తల్లియని ప్రార్థన సల్పిరినారదాదులున్/


తాత్పర్యము :


ఆ మహాలక్ష్మీదేవి చిన్నగా నవ్వుతూ పాలసముద్రము నుండి వెలికివచ్చి అందరికీ కనిపించింది.ఆమె దివ్యమైన శరీరకాంతితో మెరిసిపోతూ ఉంది. ఆ తల్లి అందాన్ని చూచి లోకులందరూ నిశ్చేష్టులైనారు. 'జగతికి వరాల నిచ్చే తల్లి 'అంటూ ఆమెను భక్తిగా ప్రార్థన చేశారు.//


80.

సీసము.


తరుణి లావణ్యము ధగధగలాడుచు

వెలుగులు నింపెనీ విశ్వమందు

నల్లని ముంగురు లల్లన పైబడి 

ఫాలభాగమునందు గ్రాలుచుండ 

శశికితోబుట్టువై చక్కదిద్దగ మోము

చంద్రవదనయని జగతి పిల్చె

కమలాలు సిగ్గుతో కమిలిపోయినవట

కన్నుల చిందెడి కాంతిగనుచు./


తేటగీతి /


పసిడి చెక్కిలి నిగనిగల్ పరిఢవిల్ల

చుబుక మొక్కటి తనరారె శోభనముగ

కంఠసీమరేఖలకాంతి కలియతిరిగి

గానకళయందు భాసిల్లె గ్రామములుగ.//


తాత్పర్యము.


ఆ లక్ష్మీదేవి యొక్క లావణ్యము ధగధగలాడుతూ ఉంది. ఆ వెలుగులు విశ్వమంతటా నిండిపోయాయి. నల్లని ముంగురులు నుదుటిమీద వాలుతూ ఉన్నాయి.చంద్రునికి తోడబుట్టినది కదా ఆమె ముఖము అందంగా గుండ్రంగా ఉంది.అప్పుడు లోకులు ఆమెను 'చంద్రవదనా!'అని పిలిచారు.తామరపూవులు ఆ తల్లి యొక్క కనుల కాంతి చూచి సిగ్గుతో ఎఱ్ఱబడ్డాయట.ఆమె చెక్కిలి నిగనిగలాడుతూ ఉంటే అక్కడ ఆమె చిన్న చుబుకము (గడ్డము) చూడటానికి చాలా అందంగా ఉందట.

ఆమె కంఠము మీద మూడు రేఖలు గానకళలోని మూడు స్థాయిలను సూచిస్తోందట.//



టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




 
 
 

Comments


bottom of page