top of page

క్షీరసాగర మథనము - 14

Writer: T. V. L. GayathriT. V. L. Gayathri

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి, #సీసము

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 14 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 20/03/2025

క్షీరసాగర మథనము - 14 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి


ఇక క్షీరసాగర మథనము - 14 చదవండి..


84.

సీసము.


మేఘసమూహముల్ మేనులన్ ధరియించి 

మ్రోగించె కాహళా బూరలచట 

శంఖనాదంబులు సల్పుచు సిద్దులు 

వీణలన్ వాయించ వేడ్కతోడ 

నష్టదిగ్గజములు నభిషేకమొనరింప 

జలధి తన సుతకు చైలమీయ

వారిజనేత్రికి పరమ భక్తిని జూపి 

వైజయంతీమాల వరుణుడొసగె!//


తేటగీతి.


విశ్వకర్మ తా నొసగుచు వివిధవర్ణ

భూషణంబులు దేవికి పూజసేయ

మౌక్తికపు హారమున్ దెచ్చి మాత కిడుచు

పలుకు పూబోడి స్తోత్రాల పఠన జేసె.//


తాత్పర్యము.


నింగిలోని మబ్బుల గుంపులు మనుష్యరూపములతో కాహళాధ్వనులు చేశాయట. సిద్ధులు కొందరు శంఖాలు మోగిస్తే, కొందరు వీణలు వాయించారట. అష్టదిగ్గజాలు ఆ లక్ష్మీదేవికి అభిషేకము చేస్తే, సముద్రుడు తన కుమార్తెకు మంచి వస్త్రములను బహుమానంగా ఇచ్చాడట. వరుణుడు ఆ శ్రీదేవికీ చక్కని వైజయంతి మాలను ఇచ్చాడట. విశ్వకర్మ రకరకాల రంగులతో ఉండే రత్నాల నగలను ఆ తల్లికి ఇచ్చి ఆమెను పూజించాడట. ఆ సమయంలో సరస్వతీదేవి ముత్యాలహారమును లక్ష్మీదేవికిచ్చి ఆమెను స్తుతించిందట.//


85.

తేటగీతి.


కుండలంబుల నీయగన్ గుహనజాతి 

బ్రహ్మదేవుండు  పూమాల వరుసనొసగ

కమల మందహాసము చిల్కి కాంచుచుండ 

జగములన్నియు మురియుచు జయము పలికె.//


తాత్పర్యము.


ఆ లక్ష్మీదేవికీ నాగజాతి చెవులకు పెట్టుకొనే కమ్మలను తెచ్చి ఇవ్వగా, బ్రహ్మదేవుడు పూలమాలలను ఆదేవికీ ఇచ్చాడట. అప్పుడు ఆ రమాదేవి నవ్వుతూ చూస్తూ ఉంటే సర్వజగములు సంతోషంతో 'శ్రీదేవికి జయ'మంటూ  పలికాయట.

///



టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page