#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి, #సీసము

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )
Ksheerasagara Mathanamu - 15 - New Telugu Poems Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 22/03/2025
క్షీరసాగర మథనము - 15 - తెలుగు పద్యాలు
రచన: T. V. L. గాయత్రి
ఇక క్షీరసాగర మథనము - 15 చదవండి..
86.
సీసము.
కమలహారంబును కరముల ధరియించ
సిగ్గుదొంతరలతోన్ జెలగు మోము
సన్నని కౌనుపై స్తనద్వయంబట
సమముగా విలసిల్ల చాన సౌరు
నటునిటు కదులుచు నడుగులు వేయంగ
కాలియందల మ్రాగి గలగలనుచు
పట్టు వస్త్రంబుతో వల్లెవాటమ రంగ
నయన మనోజ్ఞమీ నాతి చెలువు!//
తేటగీతి.
కమల చనుదెంచ కలహంస గమనమువలె
స్వేదబిందువుల్ మోముపై చిందుచుండె
కరమునన్ గొని పూమాల కనులు త్రిప్పి
తగిన వరుడెవ్వ రాయని తరుణి గాంచె!//
తాత్పర్యము.
లక్ష్మీదేవి చేతితో తామర పూలమాలను ధరించింది.ఆ సమయంలో ఆమె సిగ్గుపడుతూ ఉంది. ఆమె నడుస్తూ ఉంటే కాలి మువ్వలు మ్రోగుతున్నాయి. పట్టుచీర కట్టుకొని రమాదేవి నయనమనోహరంగా ఉంది. ఆమె అలా హంసలాగా నడుస్తూ ఉంటే ఆమెకు చిరు చెమట పోసింది, ఆ చెమట బిందువులు కూడా ఆమె ముఖానికి అందాన్ని తెచ్చాయి. చేతిలో పూమాలతో 'తనకు తగిన వరుడెవ్వరా!' యని ఆ శ్రీదేవి కనులు త్రిప్పి చుట్టూ చూస్తూ ఉంది.//
87.
తేటగీతి.
దోషరహితుడైనట్టియా దొర యెవరు?
సకల గుణములు కల్గిన శాశ్వతుండు
పరమపావన మూర్తియై వరములొసగు
వరుడు దొరకునా లోకాన? వధువు కొఱకు!//
తాత్పర్యము.
ఎటువంటి దోషము లేనటువంటి దొర ఎవరు?
అన్నీ మంచి గుణాలు కల్గి శాశ్వతుడైనవాడు, పరమ పావనమూర్తిగా నిలిచి, భక్తజనులకు వరములిచ్చే వరుడు ఈ వధువు యైన లక్ష్మీదేవికి ఈ లోకంలో దొరుకుతాడా?//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments