#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి, #సీసము

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )
Ksheerasagara Mathanamu - 16 - New Telugu Poems Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 25/03/2025
క్షీరసాగర మథనము - 16 - తెలుగు పద్యాలు
రచన: T. V. L. గాయత్రి
ఇక క్షీరసాగర మథనము - 16 చదవండి..
88.
తేటగీతి.
దేవగంధర్వ యక్షులన్ దేఱి చూచి
విసువుకొనుచును తుదకట విష్ణునిగని
త్రిగుణ రహితుండు జిష్ణుండు తగిన వరుడు
పరమపథమును జూపెడి వరదుడతడు!//
తాత్పర్యము.
ఆ లక్ష్మీదేవి దేవతలను,గంధర్వజాతివారిని, యక్షులను తేరిపార చూస్తూ, విసుగ్గా వెళుతూ చివరకు విష్ణువును చూసింది. ఆ విష్ణుమూర్తి ఆమెకు తగిన వరుడు. పరమపథమును చూపే పరమాత్మ. కోరిన వారి కోరికలు తీర్చేవాడు. గుణదోషములు లేనివాడు.//
89.
తేటగీతి.
యనుచు వరమాల గైకొని యబ్దితనయ
శ్రీశు కంఠమందున వేసి సిగ్గుపడెను
ప్రేమ నిండిన కనులతో ప్రీతితోడ
చూపు ద్రిప్పక నాహరిన్ జూచుచుండె!//
తాత్పర్యము.
ఈ విష్ణువు తనకు తగినవాడనుకొంటూ లక్ష్మీదేవి తన చేతిలోని పూమాలను శ్రీహరి మెడలో వేసి సిగ్గుపడింది. చాలా ప్రేమగా హరి వైపు చూస్తూ ఉంది.//
90.
తేటగీతి.
అతివ మానసంబును గెల్చి యక్షధరుడు
తనదు వక్షమందునసిరిని దాల్చెనపుడు
జగములేలెడి జంటకు జయమటంచు
ముజ్జగంబులు భక్తితో మ్రొక్కెనపుడు.//
తాత్పర్యము.
లక్ష్మీదేవి మనసు గెల్చుకొన్న విష్ణుమూర్తి తన హృదయంలో సిరిని నిలుపుకొన్నాడు. అప్పుడు జగములను పరిపాలించే లక్ష్మీనారాయణులకు 'జయము !జయము!'అని ముల్లోకములు మొక్కుతూ ఉన్నాయి.//
91.
తేటగీతి.
శంఖనాదముల్ మ్రోగెనా సమయమందు
నృత్యముల్ జేసి పాడుచు నివ్వటిల్లి
యప్సరాంగనామణులెల్ల యమితమైన
సంతసంబును బొందిరా స్వర్గమందు.//
తాత్పర్యము.
ఆ సమయంలో శంఖనాదములు మ్రోగాయి. స్వర్గంలోని అప్సరసలు చాలా సంతోషంతో పాటలు పాడుచు, నృత్యాలు చేశారు.//
92.
తేటగీతి.
పుష్పవృష్టిని కురిపించి మొయిలునుండి
బ్రహ్మదేవుండు, దేవతల్, పరమశివుడు
ఘనులు ప్రజాపతులు గూడి కరములెత్తి
స్తుతులు పఠియించి భక్తితో సొక్కిరంత.//
దేవతలు ఆకాశంనుండి పుష్పవర్షం కురిపించారు. బ్రహ్మదేవుడు, పరమశివుడు, ప్రజాపతులు, దేవతలు అందరూ చేతులెత్తి లక్ష్మీనారాయణులను భక్తితో స్తుతించారు.//
(సశేషం ).
క్షీరసాగర మథనము - 17 త్వరలో

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments