top of page

క్షీరసాగర మథనము - 22

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 22 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 11/04/2025

క్షీరసాగర మథనము - 22 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి


ఇక క్షీరసాగర మథనము - 22 చదవండి..


115.

తేటగీతి.


విష్ణుమాయ నెఱుంగక వెలదిఁ గాంచి 

దేవదానవుల్ తూరుపు దిక్కుయందు 

నధివసించిరి ముదముతో నమృతమునట 

త్రావబూనుచు సల్పిరి ధర్మవిధులు.//


తాత్పర్యము.


విష్ణుమాయను తెలిసికొనలేని దేవతలు, రాక్షసులు ఆ మోహినిని చూచి, అమృతమును త్రావటానికి ముందు చేయవలసిన పూజలను చేసి తూర్పు దిక్కుగా కూర్చున్నారు.//


116.

తేటగీతి.


క్రూరులైనట్టి దైత్యులన్ గూల్చివేయ 

విష్ణు వత్తఱి దివిజలన్ వేరుచేసి 

యమృత కలశంబు చేబూని యమరతతికి 

పంచిపెట్టుచు నుండెనా పంక్తిలోన!//


తాత్పర్యము.


చెడ్డవాళ్ళైన రాక్షసులను ఓడించటానికి విష్ణుమూర్తి దేవతలనొక వరుసలో, రాక్షసులనొక వరుసలో కూర్చుండబెట్టి అమృతకలశాన్ని తీసికొని దేవతలకు పంచిపెడుతూ ఉన్నాడు.//


117.

తేటగీతి.


మోహినీదేవి చేసెడి మోసకారి 

తనము గాంచి రాహువనెడి దైత్యవరుడు 

దేవతారూపమున్ గొని దివిజులకడ 

చేరి యమృతంబు త్రావగ సిద్ధపడెను.//


తాత్పర్యము.


మోహినీదేవి చేసే మోసమును గమనించి రాహువను రాక్షసుడు దేవతారూపముతో దేవతల ప్రక్కన కూర్చుని అమృతమును త్రావటానికి సిద్ధపడ్డాడు.//


(సశేషం )



క్షీరసాగర మథనము - 23 త్వరలో


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page