క్షీరసాగర మథనము - 24
- T. V. L. Gayathri
- 5 hours ago
- 2 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )
Ksheerasagara Mathanamu - 24 - New Telugu Poems Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 19/04/2025
క్షీరసాగర మథనము - 24 - తెలుగు పద్యాలు
రచన: T. V. L. గాయత్రి
ఇక క్షీరసాగర మథనము - 24 చదవండి..
121.
వచనము.
ఇవ్విధంబుగ నా విష్ణుమూర్తి దివిజవరులకు నమృతమును బంచి వారి నుద్ధరించె. అమ్మహాత్ముని కృపాకటాక్షమువలన దేవతలు యమరులైరి. క్షీరసాగరమను వృత్తాంతము నెఱింగిన యా పరీక్షిన్మహీపతి నిర్గుణాత్ముడైన శుకయోగీంద్రునికి మ్రొక్కి పరాత్పరుడా విష్ణుని దివ్యలీలలను మదియందు మరల మరల తల్చి పొంగిపోయెను.//
122.
తేటగీతి.
విష్ణుదేవుని భక్తితో వేడుకొనిన
సురలు పొందిరి సంపదల్ శుభము కలిగె
దేవదేవుని లీలలు దివ్యమైన
ఫలిత మొసగును భక్తితో పఠనజేయ!//
తాత్పర్యము.
విష్ణుదేవుని భక్తితో వేడుకొని దేవతలు సంపదలను శుభమును పొందారు.ఆ దేవదేవుని లీలలు భక్తితో చదువుకుంటే దివ్యమైనట్టి ఫలము దొరుకుతుంది.//
123.
తేటగీతి.
పరమపథమును జూపెడి పంకజాక్షు
కథలు శ్రవణము జేసిన కలిభయంబు
కలగబోదని శుకయోగి పలుకుచుండ
పుణ్యశీలుని గని రేడు మ్రొక్కెనపుడు.//
తాత్పర్యము.
ముక్తిమార్గము చూపే విష్ణుమూర్తి కథలు విన్నంతమాత్రాన కలిభయము ఉండదని శుకయోగీంద్రుడు తెలుపగానే ఆ పరీక్షిన్మహారాజు ఆ యోగికి భక్తితో మ్రొక్కాడు.//
124.
మత్తకోకిల.
మంగళంబులు.
మంగళంబులు దానవారికి మంగళంబులు ధర్మికిన్
మంగళంబులు చక్రధారికి మంగళంబులు శౌరికిన్
మంగళంబులు వేదరక్షకు మంగళంబులు విష్ణుకున్
మంగళంబులు కేశిహంతకు మంగళంబులు కృష్ణకున్//
(సమాప్తం)
'క్షీరసాగరమథనము' అను విష్ణులీల నేటితో సమాప్తము.

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments