#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి
![](https://static.wixstatic.com/media/acb93b_9b2545a7eae84094a664cf9952b73781~mv2.jpg/v1/fill/w_940,h_788,al_c,q_85,enc_auto/acb93b_9b2545a7eae84094a664cf9952b73781~mv2.jpg)
(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )
Ksheerasagara Mathanamu - 5 - New Telugu Poems Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 01/02/2025
క్షీరసాగర మథనము - 5 - తెలుగు పద్యాలు
రచన: T. V. L. గాయత్రి
44.
తేటగీతి.
దివిజతతి మరి యసురులు స్థిరమతులయి
బలముతో మథియింపంగ జలధినంత
నాగరాజైన వాసుకి నలువుమీర
ఘోరమౌవిష జ్వాలలన్ గురియుచుండె.//
తాత్పర్యము :
దేవతలు, దానవులు కలిసి బలముతో పాలసముద్రమును చిలుకుచుండగా మందరపర్వతమునకు త్రాడుగా చుట్టుకొన్న వాసుకి అను మహాసర్పము విషజ్వాలలను తన నోటినుండి చిమ్ముతూ ఉంది.//
45.
తేటగీతి.
పాము విదిలించు శ్వాసతో బాధనొంది
శక్తిహీనులై దివిజులు జడిసిపోవ
నసుర జాతులు వగపుతో నదరిపడగ
పద్మనాభుండు దయగొని భయముబాపె.//
తాత్పర్యము :
పాము విదిలించెడి విషపుగాలితో దేవతలు, రాక్షసులు తట్టుకొనే శక్తిలేక భయపడుతూ ఉంటే శ్రీమహావిష్ణువు వారి భయాన్ని పోగొట్టాడు.//
46.
తేటగీతి.
వర్షధారలు కురిపించి
వరదుడగుచు
వారినాదుకొనుచు హరి బ్రాణమొసగ
దివిజ దానవ గణములు స్థిరముగాను
క్షీరసాగరంబును వేగ చిల్కిరపుడు.//
తాత్పర్యము :
ఆ పాలసముద్రముపైన శ్రీహరి వర్షాన్ని కురిపించగా వాతావరణం కాస్త చల్లబడింది.ప్రాణాలు తిరిగి వచ్చాయి.అప్పుడు దేవతలు, దానవులు బలం కలవారై పాలసముద్రాన్ని ఇంకా వేగంగా చిలకసాగారు.//
47.
తేటగీతి.
జలచరంబులు క్షోభతో జరజరయని
తిరుగుచున్నవి కలశాబ్ధి తెరలుచుండ
నట్టి కాలము నందు విషాగ్ని పుట్టి
సర్వదిక్కులఁ వ్యాపించె సత్వరముగ.//
తాత్పర్యము :
ఇలా దేవ దానవులు పాలసముద్రాన్ని చిలుకుతూ ఉంటే,పాలసముద్రంలో ఉండే చేపలు, తాబేళ్ల వంటి జలచరాలు చాలా బాధపడుతూ, అవి కూడా గిరగిరా తిరుగుతున్నాయి. ఆ సమయంలో ఆ పాలసముద్రంలో ఘోరమైన విషము అగ్ని వలె మండుతూ పుట్టుకొచ్చింది.ఆ అగ్ని జ్వాలలు వెంటనే నలుదిక్కులకూ వ్యాపించాయి.//
48.
తేటగీతి.
దుర్భరంబైన విషకీల దుస్తరముగ
జగతి పైబడి పీడింప జనులు వగచి
త్రాహిపాహి యటంచును తల్లడిల్లి
శరణు వేడిరి శివునిసచ్ఛాంతి
కొఱకు.//
తాత్పర్యము :
భరించలేనటువంటి విషజ్వాలలు జగతిపైన పడ్డాయి.. వాటిని చూచి ప్రజలు చాలా భయపడ్డారు.దేవతలు, రాక్షసులు, జనులు కలిసి పరమశివుని వద్దకు వెళ్లి రక్షించమని వేడుకొన్నారు.//
49.
తేటగీతి.
సతిని కూడిన శంభుడు జపతపంబు
సల్పుచుండెను జగతికి జయమునొసగ
పరమ శివునిని దర్శించి బ్రహ్మమరియు
సకల దేవతల్ మ్రొక్కిరి సాగిలపడి.//
తాత్పర్యము :
ఆ సమయంలో పరమశివుడు కైలాసంలో పార్వతీదేవితో కూడి విశ్వశాంతి కొఱకు తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ మరియు సకల దేవతలు శంకరునికి సాగిలిపడి మ్రొక్కారు.//
క్షీరసాగర మథనము - 6 త్వరలో
![](https://static.wixstatic.com/media/acb93b_5f0667fa4fb2479ba3b15b34f01b0d51~mv2.jpeg/v1/fill/w_980,h_1136,al_c,q_85,usm_0.66_1.00_0.01,enc_auto/acb93b_5f0667fa4fb2479ba3b15b34f01b0d51~mv2.jpeg)
టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Komentarai