రంగుల ప్రపంచం
- Varanasi Bhanumurthy Rao
- Nov 6, 2023
- 8 min read

'Rangula Prapancham' - New Telugu Story Written By Varanasi Bhanumurthy Rao
Published In manatelugukathalu.com On 06/11/2023
'రంగుల ప్రపంచం' తెలుగు కథ
రచన: వారణాసి భానుమూర్తి రావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
స్కోడా కార్ లో హై టెక్ సిటీ వైపు వెడుతున్నాను ఏదో పని మీద. వెనుక సీట్లో శ్రీమతి మా చిన్ని గాడితో కూర్చో నుంది. చిన్ని గాడి ఏడుపు. " ఏమయింది ? మాటి మాటికీ ఏడుస్తున్నాడు ?" కొంచెం అసహనంగా అన్నాను.
మే నెల ఎండలు వాగి పోతున్నాయి. కార్ లో ఏ సి ఎఫెక్ట్ బాగా ఉంటే గూడా ఉమ్మదంగా ఉంది.
''డైపర్ మార్చాలండి.. కొంచెం పక్కకి కార్ ఆపుతారా ? ''
అంది శ్రీమతి.
''అన్ని ఇంటిలోనే చూసుకొని రావాలి గదా శశి.. ఏమిటిది ?'' అసహనంగా అన్నాను నేను.
జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర రెడ్ సిగ్నల్లో అపాను.. బంజారా హిల్స్ నుండి వస్తున్నాను. అంతలో ఒకావిడ కొన్ని వస్తువులు అమ్మ జూపుతోంది. అవి కార్ షేడ్ షీల్డ్స్.. ఎండ ఆపడానికి పనికొస్తాయి. దీనంగా ఆమె అడుగు తోంది. అమె కళ్ళల్లో దైన్యం, ముఖంలో నీరసం. ఆమె చేతిలో ఆరేడు నెలల పసి కందు. ఎండకో, ఆకలికో గుక్క పెట్టి ఏడుస్తోంది. శ్రీమతి డైపర్ మార్చడంలో బిజీ గా ఉంది.
''శశి.. కొందామా.. పాపం ఆమెకు హెల్ప్ చేసినట్లు ఉంటుంది'' అడిగాను నేను.
శ్రీమతి ఎగిరి గంతేసింది. '' ఛీ పాడు.. వాళ్ళ చేతుల్లో బాక్టీరియా. చూడండి ఆమె ఎలా ఉందో. లక్షణంగా షాపులో కొనవచ్చు గదా ''
''ఎంతమ్మా ?'' అని అడిగాను నేను.
''రెండు వందలు సారూ.. ఎంతిస్తారు చెప్పండి ? '' ఆమె ముఖం విప్పారింది.. నేను కొంటా నేమో అని ''నూట యాభై ఇవ్వండి సారూ.. '' అంది ఆమె మళ్ళీ.
శ్రీమతి విండో గ్లాస్ ఓపెన్ చేసినందుకు తిట్ల వర్షం కురిపిస్తోంది. ''డర్టీ భిక్ష గాళ్ళ దగ్గర కొంటారేమండి.. '' అంది కోపంగా.
గ్రీన్ సిగ్నల్ పడింది. ''అమ్మా.. వద్దు లే !'' అన్నాను నేను.
''సారూ! నా బిడ్డ పాలు తాగి రెండు రోజులయ్యింది. నీళ్ల మీదే బతుకు తున్నాడు '' అని ఆమె రెండు చేతుల్తో నమస్కరించి ఏడుస్తోంది. నా కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. జోబీలో ఉన్న రెండు వందలు తీసి ఆమెకు ఇచ్చాను. ''సారూ.. ''అని ఒక కొత్త పాక్ తీసి ఆమె నాకు ఇవ్వ బోయింది.
'' నాకు అవి వద్దమ్మా.. ఈ రెండు వందలు పెట్టి పిల్ల వాడికి పాలు, బిస్కట్లు కొని ఇవ్వు'' అని కార్ హై టెక్ సిటీ వైపు పోనిచ్చాను.
'' మీరు ఇంత పెద్ద జాబ్ చేస్తూ రోడ్ల మీద ఏమిటండీ ఆ కొనుడు? మీకసలు బుద్ది వున్నదా ? వాళ్ళ దగ్గర నుండి ఇన్ఫెక్షన్ వచ్చి రోగాలు వస్తాయి ''అంది గట్టిగా అరుస్తూ.
''అనవసరంగా రెండు వందలు వేస్ట్ చేశారు. ఇలాంటి బిక్షగాళ్లు మన దేశంలో కోట్ల మంది ఉన్నారు. ఇలా డబ్బులు పంచుకొంటూ పొతే మన ఆస్తులు అమ్ముకోవాలి '' అంది కాస్త ఉక్రోషంగా.
=================================================
కార్ హోటల్ వెస్ట్ ఇన్ ముందర నిలిపాను. మా ఫ్రెండ్ డాటర్స్ బర్త్ డే పార్టీ. '' గిఫ్ట్ కొనడం మరచి పోయాం.. ఇప్పుడేం చేద్దాం ? అన్నాను నేను.
"ఎటిఎం పక్కనే ఉంది.. పది వేల రూపాయలు డ్రా చెయ్యండి. గిఫ్ట్ కవర్లో పెట్టి ఇస్తాం '' అంది శ్రీమతి.
''ఏమిటి.. పది వేలా ??''
''వాళ్లు మన చంటి గాడి బర్త్ డేకి ఇరవై వేలిస్తారు లెండి. మన డబ్బులు ఎక్కడికీ పోవు" అంది శ్రీమతి
''అక్కడ కార్ సన్ షేడ్స్ కొనడానికి రెండు వందలు వద్దన్నావు. ఇప్పుడు పది వేలు పెట్టడానికి గూడా రెడీగా ఉన్నావు ''
శశి ఏమీ మాట్లాడలేదు.. కారు దిగి పోయింది బర్త్ డే పార్టీ చాలా గ్రాండ్ గా జరిగింది.
"ఐదు లక్షలు ఖర్చు పెట్టాడట ఆనంద రావు వాళ్ళ అమ్మాయి బర్త్ డే పార్టీకి '' అంది శ్రీమతి నా చెవిలో గుసగుసలు పెడుతూ. ఆశ్చర్య పోయ్యాను నేను. బర్త్ డే పార్టీ కి ఐదు లక్షలు పెట్టే ధనవంతులున్న ఈ దేశంలో పుట్టిన పిల్లలకి పాలు గూడా కొనలేని స్థితిలో ఉన్న ఆగర్భ దరిద్రులు ఉన్నారు. ఈ దేశం లో సమన్యాయం ఎప్పుడు జరుగుతుంది ? నాకా రాత్రి నిద్ర పట్టలేదు. మాటి మాటికీ అడుక్కొన్న ఆమె గుర్తుకు వస్తోంది. ---------------------------------------------------------------------------------------------
''శశి.. ఈ రోజు మనము కర్నూలు వెళ్ళాలి. అర్జంటుగా ఆఫీసు పని మీద వెళ్ళాలి'' అన్నాను నేను రెండు రోజుల తర్వాత.
''అలాగే మంత్రాలయం వెళ్లి వస్తామా?'' అంది శ్రీమతి.
''ఏమో చూద్దాం'' అన్నాను నేను.
బ్యాగేజి అంతా సర్దుకొని డిక్కీ లో పడేశాను. చంటి గాడికి కావల్సిన వన్నీ శ్రీమతి సర్దుకొని వెనుక సీట్లో పెట్టింది. కారు రెండు గంటల్లో ఔటర్ రింగ్ రోడ్ మీదుగా జడ్ చెర్ల చేరింది. టైం పదుకొండు గంటలు దాటింది. మిట్ట మధ్యాహ్నం ఎండలు మాడి పోతున్నాయి. రోడ్ల మీద మనుష్య సంచారమే లేదు.
“నలభై ఐదు సెంటి గ్రేడ్ దాటిందేమో!” అన్నాను నేను.
''ఈ దరిద్రపు ఎండల్లో ఏమిటండి ఈ పాడు ప్రయాణం?'' అంది విసుగ్గ శ్రీమతి.
"అవును నాకు గూడా అలానే అన్పిస్తోంది. కానీ ఏమి చెయ్యలేను. రాత్రి ఎండి గారు ఫోన్ చేసి కర్నూల్ లో డీలర్స్ కాన్ఫెరెన్స్ అట్టెండ్ కమ్మన్నాడు " అన్నాను.
కారు జడ్ చెర్ల దాటి అరవై కిలో మీటర్లు ముందుకు వురికింది. రోడ్లు మాడి పోతున్నాయి. కారు టైర్లు కరిగి పోతాయేమో అన్న భయం వేసింది నాకు. అనుకొన్నట్లు గానే కారు టైర్ ' తుస్ ' అని ఒక్క పెద్ద శబ్దంతో పంచర్ అయిపొయింది. స్టీరింగ్ బాలన్స్ తప్పి కారు అటు ఇటు కదిలింది పాము లాగా. శ్రీమతి కెవ్వు మని అరచి ఏడుస్తోంది. పిల్లాడు గూడా భయపడి ఏడ్పు ఎత్తుకొన్నాడు. మెల్లగా స్టీరింగ్ కంట్రోల్ చేసి ఒక చెట్టు క్రింద అపాను.
''మీరు టైర్ లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసు కోవాలి గదా.. స్టెప్ని ఉందా ?మార్చడం వచ్చా? " ప్రశ్నలు గాభరాతో వేసింది శశి. కారు డోర్ వెనుక తెరచి చూసాను..
''ఓహ్ మై గాడ్ స్టెప్ని లేదు.. మొన్న స్టెప్నీ గారేజీ లోనే పెట్టాను. ఇప్పుడెలా? " భయంతో కాళ్ళలో వణుకు పుట్టింది నాకు.
''మళ్లి జడ్చెర్లకి వెళ్లి ఈ కార్ టైర్ తీసుకెళ్ళి పంచర్ వేసుకొని మెకానిక్ తో రావాలి. కనీసం ఇంకా మూడు గంటలయినా పడుతుంది. '' అన్నాను నేను.
శ్రీమతి ముఖంలో భయం.. ఏడ్పు.. బయటికి వచ్చి చెట్టు క్రింద పిల్లాడితో నిలబడింది. మొబైల్ తీసుకోని ఎండి గారికి ఉన్న విషయం చెప్పాను. ఆయన ఏమైనా అంటాడేమో అని భయం వేసింది నాకు. సరే కర్నూల్ లో ఉన్న జోనల్ మేనేజర్ ను అటెండ్ కమ్మని చెప్పారు ఎండి గారు. బ్రతుకు జీవుడా అని జోనల్ మేనేజర్ కి ఫోన్ చేసాను.
''నీళ్లు లేవు, , పాలు లేవు త్రాగడానికి.. ఇప్పుడెలా. కర్నూలు లో అన్నీ దొరుకు తాయన్నారు.. ఎక్కువ పెట్టుక రాలేదు నేను'' అంది శ్రీమతి గాభరాగా.
అంతలో అక్కడున్న గుడిసె లోంచి ఒక ఆసామీ వచ్చాడు. అతను అరవై సంవత్సరాల దాటిన ముసలాయన. చినిగి పోయిన బనీను, లుంగీ, తలపాగాతో వున్నాడు.
“ఏమి సారూ.. ఏమయ్యింది '' అడిగాడు అతను. కథంతా చెప్పాను.
''తమరికి ఫికర్ అక్కర లేదు.. నా మనమడు ఉన్నాడు.. ఆడు అంతా సూసు కొంటాడు. పరేషాన్ వద్దు. రండి నా గుడిసె లోకి'' అన్నాడు ఆ తాత. గుడిసె లోకి వెళ్ళగానే పాచిపోయిన అన్నం వాసన వస్తోంది.
''నీళ్లు త్రాగండి '' అని ఒక ముంతలో నీరు నింపి ఇచ్చాడు. నేను గడ గడ మని నీళ్లు త్రాగేశాను. శ్రీమతి తాగ లేక పోయింది. అయినా తప్పలేదు. ఆ నీళ్ళే తాగింది. అక్కడున్న మేక దగ్గరికి వెళ్ళి మేక పాలు అప్పుడు పిండి, పిల్లాడికి తాపమని చెప్పాడు ఆ పెద్దాయన. అలాగే ఇష్టం లేక పోయినా తప్పదన్నట్లు చేసింది. తాను ఎప్పుడు చేసినవో గాని ఆరేడు జొన్న రొట్టెలు, గొడ్డు కారం మా ముందు ఉంచాడు. ఆకలి అవుతోంది గదా నేను మా శ్రీమతి అవి మొత్తం లాగించేశాము. అప్పుడు నా శ్రీమతికి బాక్టీరియా, అపరిశుభ్రత, ఇన్ఫెక్షన్ గుర్తుకు రాలేదు.
''మీరు కాస్త ఈ నులక మంచం మీద పడుకోండి దొరా.. మా మనమడు ఈ పని సక్క బెట్టు కొనివస్తాడు'' అన్నాడు ఆ పెద్దాయన.
వాళ్ళ మనమడు మోటార్ బైక్ లో వచ్చాడు. నా కార్ వీల్ తీసుకొని జడ్చెర్ల కి వెళ్లి రెండు గంటల్లో రిపేర్ చేసుకొని వచ్చి టైర్ వీల్ అతనే బిగించాడు.
''ఇక మీరు ఆరాంగా ఎల్లండి '' అన్నాడు పెద్దాయన. పెద్దాయన చేతిలో ఐదు వందలు పెట్టబొయ్యాను. పెద్దాయన గాని, మనమడు గాని ఒక్క పైసా గూడా ముట్టలేదు. బలవంతం మీద మెకానిక్ కి ఇచ్చిన 300 రూపాయలు తీసుకొన్నాడు పెద్దాయన మనమడు. బ్రతుకు జీవుడా అంటూ కారు మళ్ళీ వెనక్కి తిప్పి హైదరాబాద్ వైపు మళ్ళించాను. ఇల్లు చేరేసరికి రాత్రి తొమ్మిది గంటలయింది. --------------------------------------------------------------------------------------------------
రెండు రోజుల తరువాత శ్రీమతి ఆ సంఘటన జరిగిన తరువాత చాలా ముభావంగా ఉంది. ఏమీ మాట్లాడం లేదు. ఏదో ఆలోచిస్తూ చాలా బాధ గా ఉంది. ఆ రోజు సాయంకాలం మళ్ళీ మేము జూబిలీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఆగాం. మళ్ళీ ఆమె ప్రత్యక్షమైయింది. '' కార్ షేడ్స్.. సారూ కొనుండ్రి'' అనింది. ఆమె చేతిలో పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు.
శ్రీమతి కారు డోరు తెరిచి తన చేతిలో ఉన్న ఒక్క పాకెట్ ఇచ్చింది. ''మా బాబు బట్టలు ఉన్నాయి. ఇంకో పాకెట్లో నా చీరలు ఉన్నాయి. తీసుకో అమ్మ.. '' అని ఆమె చేతిలో వంద రూపాయలు పెట్టింది నా శ్రీమతి.
మరుసటి రోజు రెండు గిన్నెలు నిండా పులిహోర, పెరుగన్నం తీసుకొని పక్కనున్న గుడిలో అక్కడ అడుక్కొనే వాళ్ళకి పంచి పెట్టి వచ్చింది, మా శ్రీమతి లో వచ్చిన ఈ మార్పు చూసి నేను చాలా సంతోషించాను.
ఆ రోజు రాత్రి, ''శశి.. నీలో ఏదో మార్పు కొట్టిచ్చినట్లు కన్పిస్తోంది '' అని అడిగాను.
శ్రీమతి కళ్లలో కన్నీళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. '' కార్ ఏసీలో కూర్చోని, నీలి అద్దాల్లో ఇదే ప్రపంచాన్ని చూస్తే ఏడు రంగుల సినిమాలా కన్పించేది నాకు. కానీ ఒక్కసారి క్రిందకు దిగి చూస్తే నిజమైన బాధల ప్రపంచం కనపడింది. ఆ పెద్దాయన, ఆయన మనమడు చూపిన త్యాగం నన్ను, నా జీవితాన్ని మార్చి వేసిందండీ.'' అంది నా భుజాల మీద వాలిపోతూ. చిన్న పిల్లలా ఏడుస్తున్న నా శ్రీమతిని సముదాయించడానికి నాకు చాలా కష్టమైంది. ============================================================
వారణాసి భానుమూర్తి రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
వారణాసి భానుమూర్తి రావు గారు ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె లో జన్మించాడు. అతను వృత్తిరీత్యా కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పనిచేసాడు. ప్రవృత్తి రీత్యా కథలు , వచన కవితలు రాస్తున్నాడు. ఇప్పటికి అతను 60 కథానికలు, 600 దాకా వచన కవితలు రాశాడు. అతని కథలు ఆంధ్ర జ్యోతి , విజేత , ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో 1981 లో 'జీవన గతులు ' అనే కథ అచ్చయ్యింది. తరువాత ' ఈ దేశం ఏమై పోతోంది? ' అనే అదివారం ఆంధ్రప్రభ దిన పత్రిక లో అచ్చయ్యింది. ఆంధ్ర జ్యోతిలో పది కథలు దాకా అచ్చయ్యాయి. నల్లటి నిజం , జన్మ భూమి , అంతర్యుద్ధం , వాన దేముడా! లాంటి కథలు అచ్చు అయ్యాయి. 2000లో "*సాగర మథనం* ", 2005 లో " *సముద్ర ఘోష*" అనే కవిత సంపుటిలను ప్రచురించాడు. అందులో "సముద్ర ఘోష" పుస్తకాన్ని అక్కినేని నాగేశ్వర రావు గారికి అంకితం చేశారు. ఈ పుస్తకాన్ని జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి. నారాయణ రెడ్డి విడుదల చేసారు. అతను రాసిన కథ "పెద్ద కొడుకు" ( రాయల సీమ రైతు బిడ్డ మీద కథాంశం) భావగీతి ప్రతిలిపి 2014 కథల పోటీలో ప్రతిలిపి ద్వారా ప్రత్యేక బహుమతి పొందింది.ఈ కథను 60000 మంది పాఠకులు చదివారు. 4500 మంది స్పందించారు.
వారణాసి భానుమూర్తి రావు రాయలసీమ వ్యవహారిక బాషలో వ్రాయడానికి ఇష్టపడతారు.ఇప్పుడు " రాచపల్లి కథలు " , " నాన్నకు జాబు " అని తమ చిన్ననాటి అనుభవాలన్నింటినీ అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు. .అలాగే తన మొట్టమొదటి నవలా ప్రక్రియను " సంస్కార సమేత రెడ్డి నాయుడు " తెలుగు వారి కోసం వ్రాశారు .ఆ తరువాత '' వరూధిని - ప్రవరాఖ్య '' శృంగార ప్రబంధ కావ్యాన్ని తమ దైన శైలిలో నవలీ కరణ చేశారు . కరోనా పై వీరు రాసిన కవిత ఆంధ్ర ప్రభలో ప్రచురించారు. సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ ను కనబరచిన వీరికి సాహితీ భూషణ , ప్రతిలిపి కవితా ప్రపూర్ణ ,సహస్ర కవి రత్న అనే బిరుదులు లభించాయి.
వారణాసి భానుమూర్తి రావు గారు ఇటీవల అనగా ఏప్రిల్ నెల 2022 లో రెండు పుస్తకాలు పాఠక లోకానికి అందించారు. 1. *మట్టి వేదం* కవితా సంపుటి 2. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* తెలుగు నవల . గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ వారిచే సాహిత్య రంగంలో విశేష మైన సేవలు చేసినందుకు గానూ , వీరి *మట్టి వేదం* కవితా సంపుటికి , *గిడుగు రామమూర్తి సాహిత్య పురస్కారం -2022* ని అందు కొన్నారు.
తెలుగు కవులు లో వారణాసి వారి కథలు రాయల సీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో కలిగి వుంటాయి.చిత్తూరు జిల్లాకు చెందిన వారణాసి భానుమూర్తి గారి కథలు , కవితలు వివిధ ఆన్ లైన్ పత్రికలలో వచ్చాయి. త్వరలో మరి కొన్ని నవలలు , కథల సంపుటాలు , కవితా సంకలనాలు వెలువడుతున్నాయి.ఇంతవరకు మూడు కవితా సంపుటిలు , ఒక నవలను పాఠక లోకానికి అందించారు.
*వీరి ముద్రిత రచనలు* ------------------
1. *సాగర మథనం* : 2000 సంవత్సరంలో అవిష్కరించారు. డాక్టర్ గోపీ గారు , తెలుగు అకాడమీ ప్రధాన సంచాలకులు , ఈ కవితా సంపుటి మీద ముందు మాట వ్రాశారు.
2. *సముద్ర ఘోష*: 90 కవితలున్న ఈ కవితా సంపుటి 2005 సంవత్సరంలో జ్డానపీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ( సినారె) అవిష్కరించారు. ఈ పుస్తకాన్ని , పద్మ విభూషణ్ డాక్టర్ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకిత మిచ్చారు .
3. *మట్టి వేదం* : 70 కవితలున్న ఈ కవితా సంకలనాన్ని 2022 ఏప్రిల్ నెల 17 వ తేదీ వెలువరించారు. ఈ పుస్తకానికి కే రే జగదీష్ గారు , ప్రముఖ కవి , జర్నలిస్టు ముందు మాట వ్రాశారు
4. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* : ఇది రచయిత గారి తొలి నవలా ప్రక్రియ. ఈ నవల 17 ఏప్రిల్ 2022 నాడు అవిష్కరణ జరిగింది. ఈ నవల రాయల సీమ కక్షలు , ఫాక్షన్ ల మధ్య ఎలా రెండు కుటుంబాలు , రెండు గ్రామాలు నలిగి పొయ్యాయో తెలిపిన కథ. శ్రీమతి రాధికా ప్రసాద్ గారు ఈ నవలకు ముందు మాట వ్రాశారు. ఈ నవలకు ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 అందు కొన్నారు.
5. *పెద్ద కొడుకు* : 19 కథల సంపుటి. వారణాసి భానుమూర్తి రావు గారు వ్రాసిన కథల సంపుటి *పెద్ద కొడుకు* తుమ్మల పల్లి కళా క్షేత్రం , విజయ వాడ లో మల్లె తీగ వారు నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు , ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చేర్ పర్సన్ , కళారత్న శ్రీ బిక్కి కృష్ణ , తదితరుల చేతుల మీదుగా 20.11.2022 తేదీన అవిష్కరించారు. ఇందులో 19 కథలు ఉన్నాయి. ప్రతి కథ ఆణి ముత్యమే. కళా రత్న శ్రీ బిక్కి కృష్ణ గారు ముందు మాట వ్రాసిన ఈ పెద్ద కొడుకు కథల సంపుటి మానవీయ విలువల్ని అనేక కోణాల్లో రచయిత స్పృశించారు. వారణాసి గారు ఈ " పెద్ద కొడుకు " కథల సంపుటిని పాఠక లోకానికి అందించారు. ఇందులోని కథలన్నీ ఆణి ముత్యాలే! సమాజానికి సందేశ మిచ్చే కథలే!
*అముద్రిత రచనలు*
1 . *వరూధిని ప్రవరాఖ్య* : అల్లసాని పెద్దన గారి మను చరిత్రము నవలీ కరణ చేశారు. ఇది ఇంకా అముద్రితము.త్వరలో ప్రచురణకు వస్తుంది.
2 .*రాచ పల్లి కథలు* : తన చిన్న నాటి అనుభూతుల్ని , గ్రామీణ ప్రాంతాల్లో తను గడిపిన అనుభవాల్ని క్రోడీకరించి వ్రాసిన కథానికలు . త్వరలో ప్రచురణకు వస్తుంది.
3 . *నాలుగవ కవితా సంపుటి* త్వరలో వస్తుంది.
4 . *నాయనకు జాబు* అనే ధారావాహిక ఇప్పుడు వ్రాస్తున్నారు. లేఖా సాహిత్యం ద్వారా కథను వాస్తవిక సంఘటనలతో చెప్పడం ఈ జాబుల ప్రత్యేకత.
*విద్యాభ్యాసం* -----------
వారణాసి భానుమూర్తి గారి విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలో జరిగినది.
ఐదవ తరగతి వరకూ ప్రాధమిక పాఠశాల మహల్ లో , తరువాత ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకూ మహల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగింది. ఆ తరువాత తొమ్మిది , పది తరగతులు మేడికుర్తి కలికిరి చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లో చదివారు. ఇంటర్మీడియట్ మరియు బి కాం బీ.టీ కాలేజీలో చదివారు. తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఎస్ వీ యూనివర్సిటీ లో చదివారు. వుద్యోగ నిమిత్తం హైదరాబాదు వెళ్ళిన తరువాత అక్కడ కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అక్కౌంటన్సీ ( FCMA) చేశారు. ప్రొఫెషనల్ అక్కౌంట్స్ లో నిష్ణాతులయ్యారు.
*వృత్తి* ------
వారణాసి భానుమూర్తి గారు అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ జనరల్ మేనేజర్ గా వివిధ కార్పోరేట్ కంపెనీలల్లో పని చేశారు. హైదరాబాదు మహా నగర మంచి నీటి సరఫరా మరియు మురుగు నీటి సంస్థలో చీఫ్ జనరల్ మేనేజర్ (అక్కౌంట్స్) గా పని చేశారు.ఒక పేరు పొందిన నిర్మాణ సంస్థలో సీనియర్ జనరల్ మేనేజర్ (అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ ) గా పని చేసి వివిధ బాధ్యతలను 36 సంవత్సరాల పాటు నిర్వర్తించారు. కాస్ట్ అక్కౌంట్స్ హైదరాబాదు చాప్టర్ కి వైస్ చేర్మన్ హోదాలో బాధ్యతలను నిర్వర్తించారు.
వృత్తి ఏమైనప్పటికీ , ప్రవృత్తిగా కవిగా , రచయితగా రాణించారు. పదవ తరగతి నుండీ కవితలు , కథానికలు వ్రాశారు.ఇతని కథలు , కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
ఇతనికి ఇంత వరకు లభించిన బిరుదులు; 1. ప్రతిలిపి కవితా ప్రపూర్ణ 2. సహస్ర కవి రత్న 3. సాహితీ భూషణ 4. గిడుగు రామమూర్తి వారి సాహిత్య పురస్కారం 2022 లో. 5. ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 6. కళావేదిక వారి సాహితీ పురస్కారం 31.12.2022 న అందుకొన్నారు.
Comments