top of page

రంగుల వలయంలో రాళ్ళ బతుకులు

#RangulaValayamloRallaBathukulu, #రంగులవలయంలోరాళ్ళబతుకులు, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguKathalu, #తెలుగుకథలు

Rangula Valayamlo Ralla Bathukulu - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 20/03/2025

రంగుల వలయంలో రాళ్ళ బతుకులు - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


"రంగీ, పొద్దెక్కి పోనాది. ఇంకా తయారవ లేదా? ఊళ్లో అందరూ సద్దిలు కట్టి రచ్చరాయి కాడ చేరినారు. షావుకారు బండి వచ్చే సమయమయినాది" రంగమ్మను తొందర పెడుతోంది నూకాలమ్మ. 


"అయిపోనాదే, నూకాలు " అంటూ గుడిసెకు తడిక అడ్డం పెట్టి మద్యాహ్నం బువ్వ సిల్వర్ కేరేజీలో గుడ్డకు చుట్టి మట్టిని తవ్వే తొళ్లిక చేత్తో పట్టుకుని బయలు దేరారు ఇద్దరూ. 


గిరిజన గూడెం దార్లకొండ పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ పశువుల్నీ మేకల్ని మేపుకుంటూ జీవనం సాగిస్తుంటారు అక్కడి గిరిజనులు. గత కొద్ది సంవత్సరాలుగా వర్షాలు పడక భూముల్లో పంటలు రావడం లేదు. 


పసువులకు, మేకలకు మేత కరువైనందున సంతల్లో అమ్ముకోవల్సి వస్తోంది. వయసులో ఉన్నవారు కూలి పనుల కోసం పట్నానికి వలస పోయారు. కొంతమంది మట్టి పనులకు కంట్రాక్టరు వెంట తిరుగుతున్నారు. ఇంటి వద్ద ముసలి వారిని, పిల్లల్నీ చూసుకుంటు ఆడవాళ్లు కొండ మీదికి పోయి కట్టెలు కొట్టి మోపులుగా చేసి చీపుళ్లు కట్టి దగ్గరి పట్నాల్లో అమ్మి రోజులు సాగదీస్తున్నారు. ప్రభుత్వం చెట్లను నరకడం నిషేధించడంతో ఆ బ్రతుకు తెరువు కూడా లేకపోయింది. 


దార్లకొండ చుట్టూ కొండల్లో విలువైన రంగురాళ్లు ఉన్నాయన్న సమాచారంతో కొంతమంది షావుకార్లు గిరిజనులను చేరదీసి వారికి రోజు కూలీ చొప్పున కొండల్లో తవ్వకాలు మొదలెట్టారు. 


ఉదయం వారిని వేన్లో ఎక్కడ రంగురాళ్లు లబ్యమవుతాయో అక్కడికి తీసుకుపోయి సాయంకాలం వారు తవ్వి తెచ్చిన రంగురాళ్లను వెంట తీసుకెల్తుంటారు. గిరిజనులు తవ్వి తెచ్చిన రంగురాళ్లలో కొన్నివిలువైనవి దొరుకుతుంటాయి. వాటిని షావుకార్లు డబ్బు చేసుకుంటారు. బ్రతుకు తెరువు కోసం గూడెం ఆడవారు పగలంతా ఆ కొండల్లో చేతి తొళ్లికలు గడ్డపారలతో మట్టిని తవ్వుతు కనబడిన రంగు రాళ్లను సంచులలో నింపి తెస్తారు. కొండలలో గుంపులుగా విడిపోయి 

తవ్వకాలు మొదలెడతారు. 


కొండ తవ్వకాల సమయంలో రాళ్లు మీద పడే అవకాశం ఉంటుంది. పాములు, తేళ్లు వంటి విషకీటకాలే కాదు నక్కలు, దొమ్మరిగొడ్లు కూడా తారసపడతాయి. వాటిని ఎదుర్కొంటు వెలుగు ఉండగానే తవ్విన రంగురాళ్లతో కిందకు చేరుకుంటారు కూలీలు. ప్రాణ భయమున్నా గత్యంతరం లేక రంగురాళ్ల పనులకు సిద్ధ పడుతుంటారు. ఈ రంగురాళ్ల తవ్వకాలు గోప్యంగా జరుగుతుంటాయి. 


కొంతమంది మహిళలు గుంపులుగా విడిపోయి కొండను తవ్వుకుంటూ గుహలా చేసుకుంటు లోపలికి వెళతారు. అటువంటి సమయంలో షావుకార్లు బేటరీ టార్చిలైట్లు సమకూరుస్తారు. రంగురాళ్లు వెతికే సమయంలో ఏవైనా ప్రమాదాలు జరిగినా ఎంతో కొంత డబ్బు ఖర్చు చేసి గూడెం పెద్దను లోబరుచుకుని కేసు లేకుండా చేస్తారు. 


రంగమ్మ, నూకాలమ్మ సద్ది మూటలతో రచ్చబండకు చేరుకున్న కొద్ది సేపటికి షావుకారు వేన్ రాగా అందరూ బండి ఎక్కి కూర్చున్నారు. 


దార్లకొండకు రెండు కిలోమీటర్ల దూరంలో వేన్ ఆగింది. పదిమంది వరకు గిరిజన మహిళలు వేన్ దిగి ఇద్దరు ముగ్గురు చొప్పున బృందాలుగా విడిపోయి నిన్న తవ్విన కొండ గుహకు చేరుకున్నారు. ఎవరి భాగంలో వారు పని మొదలెట్టారు. 


రంగమ్మ, నూకాలమ్మ ఒక జతగా మట్టి తవ్వకం మొదలెట్టారు. బాగా లోపలికి వెల్తున్న కొద్ది చీకటి ఉంటోంది. షావుకారు ఇచ్చిన టార్చిలైటు వెలుగులో రంగమ్మ ముందుకు పోతోంది. వెనకన ఉన్న నూకాలమ్మ ఇంక ముందుకి పోవద్దని, బువ్వ తిన్నాక తవ్వుదామని కేక వేస్తుంటే "అయిపోనాదే, వచ్చేస్తున్నా" అంటూ జాప్యం చేయసాగింది. 


ఇంతలో మట్టి పెల్లలు పడుతున్న సూచన పసిగట్టి నూకాలమ్మను బయటికి వచ్చేయమని అరుచుకుంటూ గుహ బయటకు పరుగుతీసింది. రంగమ్మ బయటకు వచ్చే లోపు పైన మట్టి పెళ్లలు విరిగి గుహ మూసుకుపోయింది. రంగమ్మ గుహ లోపల సమాధి అయింది. 


నూకాలమ్మ కేకలు విన్న మిగతా మహిళలు అక్కడికి చేరి తల బాదుకోవడం మొదలెట్టారు. ఎవరూ ఏమీ చెయ్యలేని స్థితి. లబోదిబో మంటూ ఏడుస్తు గూడేనికి చేరుకుని విషయం గూడెం పెద్దకు తెలియచేసారు. అప్పటికే సాయంత్రంమై వెలుగు మందగించింది. 


సాయంకాలం వేన్లో వచ్చిన షావుకారు మనుషులకు విషయం తెల్సినా ఎటువంటి సహాయం చెయ్యలేని పరిస్థితి. మర్నాడు పెద్ద షావుకారు వచ్చి డబ్బుతో పరిస్థితి చక్కదిద్ది కొండ గుహ నుంచి రంగమ్మ శవాన్ని పైకి తీయించి అట్టహాసంగా అంత్యక్రియలు జరిపించాడు. 


నాగరిక ప్రపంచానికి దూరంగా కొండకోనల్లో ఉండే గిరిజనుల జీవితాలు ఇలాగే ముగుస్తుంటాయి. 


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


 
 
 

Yorumlar


bottom of page