top of page

సంబరాల దీపావళి


'Sambarala Deepavali' New Telugu Story


Written By Ch. C. S. Sarma




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

మన హైందవుల ప్రతి పండుగా అందరికీ ఆనందదాయకమే. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లు పండుగ పర్వదినాల్లో ఎవరి స్థితివారు... సంబరంగా గడుపుతారు. ఆనందానికి కలిమిలేములు హద్దులు కావు. మనస్సు ముఖ్యం...


ఆరోజు ఆదివారం. సమయం సాయంత్రం


ఆరుగంటలు ప్రాంతం.

అశ్విని తన తల్లి గాయత్రి, తండ్రి శాంతారావు, మేనత్త రుక్మిణి, ఆమె భర్త భాస్కర్, వారి పిల్లలు ధరణి, బలరాం, అపర్ణలతో కలసి ఐదు గంటల ప్రాంతంలో రెండు కార్లలో వారంతా బీచ్ కి వచ్చారు.


సముద్ర ఒడ్డున యిసుకలో కొన్ని చోట్ల దగ్గర దగ్గరగా దాదాపు పదిహేను చెక్క బోట్లు వున్నాయి. పిల్లలు నలుగురూ... హైడ్ అండ్ సీక్ ఆటను ఆడడం ప్రారంభించారు. మరి కొంతమంది వారి వారి పిల్లలు, కుటుంబ సభ్యులతో అక్కడికక్కడ బీచ్ లో కూర్చుని ఉన్నారు. పెద్దలు శాంతారావు... గాయత్రి, భాస్కర్... రుక్మిణి సరదాగా తమ కాలేజీ అనుభవాలను గురించి, ఉపాధ్యాయులు, లెక్చరర్ల గురించి... ఒకరి తర్వాత ఒకరు చెబుతూ ఉంటే మిగిలిన వారు వింటూ మధ్య మధ్యన చెప్పే వారిని ప్రశ్నలు అడుగుతూ, గత స్మృతులను తలచుకుంటూ, వారి వారి ధైర్య సాహసాల గురించి చెప్పుకుంటూ... ఆ సాగర తీరంలో చల్లని గాలిలో ఎంతో ఆనందంగా నవ్వుకొంటూ చెప్పే వారి మాటలు వింటూ ఉన్నారు. పిల్లలు నలుగురికి వయసు తేడా రెండేసి సంవత్సరాలు. అందరికంటే పెద్ద రుక్మిణీ కొడుకు భరణి. వాడి వయస్సు పదిహేను. అందరికంటే చిన్న అపర్ణ వయస్సు పదకొండు.


ఆ పెద్దలు నలుగురు ఎల్ఐసి ఆఫ్ ఇండియా లో మంచి హోదాలో పనిచేస్తున్నారు. గాయత్రి, సీతారామ్ లు వైజాగ్ లో... రుక్మిణి, భాస్కర్ లు హైదరాబాదులో ఉంటున్నారు.

భరణి టెన్త్... బలరాం ఎయిత్... అపర్ణ సిక్స్త్... అశ్విని ఎయిత్ చదువుతున్నారు. దీపావళి పండుగ... అందరూ కలిసి జరుపుకోవాలనే రుక్మిణి, భాస్కర్ లు పిల్లలతో వైజాగ్ వచ్చారు. శాంతారావు అక్క రుక్మిణి.


బలరాం కళ్ళు మూసుకున్నాడు. అశ్విని, భరణి, అపర్ణలు దాక్కునేదానికి ఇసుకలో ఉన్న బోట్ల వైపుకు పరిగెత్తారు. ఒక బోటుప్రక్కన దాక్కున్నారు. బలరాం కళ్ళు తెరిచి వారిని జనం వెనుక వెతకడం ప్రారంభించాడు. పిల్లలు ముగ్గురు మాట్లాడకుండా మౌనంగా బోటు చివర నుంచి బలరాం ఎలా తిరుగుతున్నది గమనిస్తున్నారు. ఆ బోటు లోపలి ఇరువురి వ్యక్తులు మరో వ్యక్తి వచ్చి వారిని కలిశాడు.


"మేము మీకోసం అరగంట నుంచి వెయిటింగ్."

"ట్రాఫిక్ లో స్కూటర్ మీద రావడంలో ఆలస్యం అయింది. చెప్పండి మన ప్రోగ్రాం ఏంటి?"


మేము ఆ డబ్బులు, నగలను క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్లో వేప చెట్టు కింద గొయ్యి తీసి దాచాం. పోలీసులు వారి వేటను ప్రారంభించారు. రేపు అమావాస్య. పన్నెండు గంటలకు ఆ స్మశానంలో ఉన్న వేప చెట్టు దగ్గరకు రా. మనం వాటిని తీసుకొని... బాంబేకి వెళ్ళిపోదాం. సరేనా!..."

"అలాగే."


ఈ మాటలను విన్న భరణి, అపర్ణ... అశ్వనీలు ఆశ్చర్యపోయారు. ఆ ముగ్గురు బోట్ లో కూర్చుని ఉన్నందున... వీరు వంగి నేల మీద ప్రాకుతూ మెల్లిగా మరో బోటు వెనక్కి వెళ్లి... వారి కంటపడకుండా తల్లిదండ్రులు కూర్చొని ఉన్న చోటికి చేరారు.


అందరికంటే ముందు అపర్ణ "ఆ బోట్లలోఒకదాంట్లో దొంగలు ఉన్నారు నాన్నా" భాస్కర్ తో చెప్పింది.


అశ్వినీ... భరణీలు తాము విన్న సంభాషణను పెద్దలకు చెప్పారు. శాంతారావు ఆశ్చర్యపోయాడు. ఆ బోట్ల వైపుకు చూశాడు. వారికి ఆ బోట్లకు రెండు అడుగుల దూరం. ముగ్గురు వ్యక్తులు ఆ బోట్ల మధ్యలో నుంచి బయలుదేరి రోడ్డు వైపుకు నడవడం గమనించారు.


"అరుగోఅరుగో వాళ్ళే... వెళ్ళిపోతున్నారు" అన్నాడు భరణి.

"ఒరేయ్!... నోరు ముయ్యి. వారు రౌడీలు... పైగా దొంగలు. వారిని మనం ఏమీ చేయలేము" అన్నాడు భాస్కర్.


"ఏంటి బావా!... అలా అంటావ్!..." ఆశ్చర్యంతో చూశాడు శాంతారావు భాస్కర్ ముఖంలోకి.

"ఇలాంటివన్నీ మహానగరాల్లో మామూలే కదా శాంతా!..." నవ్వుతూ చెప్పాడు భాస్కర్.

"ఆ దొంగతనం ఎక్కడో జరగలేదు బావా!... మన వీధిలోనే. మన ఇంటికి ఆరో ఇల్లు. సత్యమూర్తి ఆంధ్రా బ్యాంకులో పనిచేస్తున్నాడు. పది రోజుల్లో వాడి చెల్లెలి పెళ్లి. మనకు విషయం తెలిసింది కాబట్టి ఈ విషయాన్ని మనం పోలీసులకు తెలియజేయాలి. బాధ్యత గల పౌరుడిగా అది మన కర్తవ్యంగా నేను భావిస్తున్నాను." అనునయంగా చెప్పాడు శాంతారావు.


"యస్ మామయ్య మీరు చెప్పినట్లే చేయాలి." భరణి అభిప్రాయం.

"నాన్నా!... మనం సత్యమూర్తి అంకుల్ కు హెల్ప్ చేయాలి ఆ డబ్బు నగలు ఆయనకు చేరాలా చేయాలి" అశ్విని నిర్ణయం.


"ఒరే... పిల్లకాకులు నోరు మూయండి. దొంగలతో రౌడీలతో విరోధం... మనకు అపాయం. చూడు శాంతా!... ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే మనం ఇబ్బందుల్లో పడతాం రా!... ఆవేశపడకు. నా మాట విను" భాస్కర్ నయబోధ.


"ఏవండీ!... మీరు నా తమ్ముణ్ణి ఆక్షేపించకండి. మీ పిరికితనాన్ని మీ వరకే పరిమితంగా ఉంచుకోండి. ఆ దేవుడి దయవల్ల నా కొడుక్కి మీ పిరికి బుద్ధి రాలేదు. ఒరే... తమ్ముడూ లే... మనం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి మనకు తెలిసిన నిజాలను వారికి చెబుదాం" తన అభిప్రాయాన్ని తెలిపింది రుక్మిణి.


"అవునండీ!... పాపం సత్యమూర్తి భార్య శ్యామల... డబ్బు నగలు పోవడంతో కుమిలిపోతూ ఉంది. ఆ పిల్ల నంద... తాను దురదృష్టరాలినని ఎంతగానో బాధపడుతూ ఉంది. నిర్భయంగా మనం చేయగలిగిన... సహాయం ఆ కుటుంబానికి చేసి తీరాలి. లేవండి.”


శాంతారావు లేచి నిలబడ్డాడు. అందరూ లేచారు.

"ఒరేయ్ శాంతా!.... నీ కంటే పెద్దవాణ్ణి. ఈ దొంగ పోలీస్ ఆటలో తల దూర్చటం మనకు మంచిది కాదు." అనునయంగా చెప్పాడు భాస్కర్.


"బావా!... భయపడకు. నీవు స్టేషన్ కు రావద్దు. అక్కయ్య... గాయత్రి... బలరాం... అపర్ణలతో నీవు ఇంటికి వెళ్ళిపో. నేను, భరణి, అశ్విని స్టేషన్ కు వెళ్లి ఇన్స్పెక్టర్ ను కలిసి వస్తాము. ఆయన నాకు స్నేహితుడే" నవ్వుతూ చెప్పాడు శాంతారావు.

"తమ్ముడూ!... అలాగే చెయ్యి. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సత్యమూర్తి ఇంటికి వెళ్లి విషయాన్ని చెబుతాం. వారి మనస్సుకు కొంత వూరట కలుగుతుంది." అంది రుక్మిణి.

భాస్కర్ భార్య ముఖంలోకి చిత్రంగా చూశాడు. రుక్మిణి చేత్తో తల కొట్టుకుంది భాస్కర్ మూర్ఖత్వానికి... పిరికితనానికి.


అందరూ రోడ్లోకి వచ్చారు. శాంతారావు, అశ్విని, భరణి కారులో కూర్చున్నారు. మిగతా వారంతా మరో కార్లో కూర్చున్నారు. భాస్కర్ డ్రైవర్ సీట్లు కూర్చోబోయాడు.

"మహాశయా!... ఇప్పుడు తమరు టెన్షన్ పార్టీ. పక్కకు జరగండి బండిని నేను నడుపుతాను." నవ్వుతూ అంది రుక్మిణి. భార్యను చురచురా చూశాడు భాస్కర్.

రెండు కార్లూ బయలుదేరాయి.

***

"హలో!... శాంతారావు. రండి ఏమిటి విషయం." చిరునవ్వుతో అడిగాడు ఎస్ ఐ కృష్ణారావు.

"కూర్చోండి." అన్నాడు.

ఎస్. ఐ టేబుల్ ముందర ఉన్న కుర్చీలలో ముగ్గురూ కూర్చున్నారు.

తన మేనల్లుడు భరణిని, కుమారుడు అశ్వినిని కృష్ణారావు గారికి పరిచయం చేశాడు శాంతారావు. బీచ్ లో వారు విన్న విషయాన్ని వివరించాడు. కృష్ణారావు భరణిని అశ్వినిలను ప్రశ్నలు అడిగి తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ని రాబట్టుకున్నాడు. వారిని ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఆ ముగ్గురు ఆనందంగా కారులో ఇంటికి బయలుదేరారు.

***

ఇంటికి చేరగానే... గాయత్రి, రుక్మిణి, అపర్ణ, బలరాం సత్యమూర్తి ఇంటికి వెళ్లారు. అపర్ణ తను బీచ్ లో విన్న ఆ ముగ్గురి మాటలను సత్యమూర్తికి, అతని చెల్లెలు నందకు, భార్య శ్యామలకు చెప్పింది. గాయత్రి, రుక్మిణీ లు వారి వందనాల్లో ఎంతో ఆనందాన్ని చూశారు.

"నా తమ్ముడు కొడుకు అల్లుడు స్టేషన్ కి వెళ్లారు. నగలు డబ్బు ఉన్న చోటును గురించి ఇన్స్పెక్టర్ కు చెప్పేదానికి" అంది రుక్మిణి.


"మీ సొమ్ము నగలు తప్పక దొరుకుతాయి ధైర్యంగా ఉండండి. ఆ ఇన్స్పెక్టర్ మావారికి బాగా తెలుసు." అంది గాయత్రి.

ఆ కుటుంబ సభ్యులు అశ్విని, భరణి, అపర్ణల తెలివిని, ధైర్యాన్ని, సాహసాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆ ముగ్గురు శాంతారావు ను చూసేదానికి అతని ఇంటికి వచ్చారు.


తన ఇంట్లో వారిని చూసిన శాంతారావు... తనకు ఇన్స్పెక్టర్ కృష్ణారావు చెప్పిన మాటలను సత్యమూర్తికి తెలియజేశారు. మీ సొత్తు మీకు చేరుతుంది అని హామీ ఇచ్చాడు. పిల్లలను ముగ్గురిని ముద్దులాడి సత్యమూర్తి, శ్యామల, నంద వారి ఇంటికి వెళ్లారు ఆనందంగా.

***

ఆ రాత్రి కృష్ణారావు తన బృందంతో ఆ స్మశానానికి వెళ్ళాడు. ఆ కటిక చీకటిలో టార్చిలైట్ల సాయంతో నగలు డబ్బులు పాతిపెట్టిన స్థలాన్ని గమనించి... త్రవ్వి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందరిని స్టేషన్ కు వెళ్లవలసిందిగా చెప్పి... తను డ్రైవర్తో కలిసి శాంతారాం ఇంటికి వచ్చాడు. తలుపు తట్టాడు. శాంతారావు తలుపు తెరిచాడు. అప్పుడు సమయం రాత్రి ఒంటిగంట.


శాంతారాం ఆహ్వానంతో లోపలికి నడిచి... కూర్చొని నగలను డబ్బులు అతనికి ఇవ్వబోయాడు‌. పది నిమిషాల్లో వస్తానని చెప్పి సత్యమూర్తి ఇంటికి వెళ్లి అతని పిలుచుకుని తన ఇంటికి వచ్చాడు. ఇన్స్పెక్టర్ తన వద్దనున్న డబ్బు నగలను సత్యమూర్తికి ఇచ్చాడు. సత్యమూర్తి అశ్రుపూరిత నయనాలతో పారవశ్యంతో కృష్ణారావు కాళ్ళ మీద పడ్డాడు. అతన్ని లేవనెత్తి "నేనూ పేద కుటుంబం నుంచి వచ్చిన వాడినే. నా గతాన్ని నేను ఎన్నటికీమరువలేను. మీరు ఎంతో మంచి వారని నా మిత్రుడు శాంతారాం చెప్పాడు మీరు ప్రశాంతంగా నిద్రపోవాలని ఈ నడిరేయిలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. సారీ!...." నవ్వుతూ చెప్పాడు. కృష్ణారావు చేతులు జోడించి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. సత్యమూర్తి శాంతారావు ను కౌగిలించుకొని ఆనందాశ్రువులు కార్చాడు. డబ్బు నగలతో ఆనందంగా ఇంటికి పోయాడు.


ఆ మరుసటి రోజు అమావాస్య. సమయం అర్ధరాత్రి. దొంగలు స్మశానానికి వచ్చారు. కృష్ణారావు ఎస్సై... బృందం పొంచి కాచి... ఆ దొంగలను పట్టుకున్నారు. ఆ రెండు కుటుంబాలకు ఆ దీపావళి... ఎంతో సంబరాల దీపావళి.

* * * -సమాప్తం- ***

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.



Comments


bottom of page