top of page

ఏటికి ఎదురీత



'Yetiki Edureetha' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 30/08/2024

'ఏటికి ఎదురీత' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్




"దీపా ! రేపు నీకు పెళ్ళి చూపులు. ఆటలు, పాటలు అంటూ ఎక్కడికీ వెళ్ళద్దు. " అన్న తండ్రి రామయ్య మాటలకు అప్పుటిదాకా ఊళ్ళో స్నేహితురాళ్ళతో ఆటపాటలతో సరదాగా గడిపి అప్పుడే ఇంటికి వచ్చిన దీప త్రృళ్ళి పడింది. ఆ ఇంట్లో ఆయన మాటకు తిరుగులేదు. చదువంటే ఇష్టపడే తను టెన్త్ కాగానే పెళ్ళి చేస్తానన్న తండ్రిని కాళ్ళావేళ్ళా బ్రతిమలాడి ప్రైవేటుగా ఇంటర్ పూర్తిచేసింది. ఇంక పై చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాక అప్పుడు పెళ్ళి అనుకున్న తన ఆశయాన్ని కుటుంబ ఆర్ధిక పరిస్థితులను అర్థం చేసుకుని మనసులోనే అణచుకుంది. 


 ఆ మరుసటి రోజు పెళ్ళి చూపులకు పెళ్ళి కొడుకు మినహా మిగిలిన వారంతా 20 మంది వచ్చారు. వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళి కొడుకు చూడటం ఆనవాయితీ కాదట. కుంటీ -గుడ్డీ- మూగ అని పరీక్షలు లాగా, సంతలో పశువుని కొనుక్కున్నట్టుగా అందరూ వివిధ రకాల ప్రశ్నలు, పాటలు, నడిచి చూపించే టెస్టులు వగైరాలు పూర్తయి పిల్ల నచ్చిందని చెప్పటం, తల్లి తండ్రులు సరే అని కట్న కానుకలు, లాంఛనాలు అవీ మాట్లాడుకోవడం వెంటనే జరిగిపోయాయి. వరుడు ఎలా ఉంటాడో, అతని వివరాలు, కుటుంబ పధ్ధతులు ఏమీ తనకు చెప్పలేదు సరికదా, తన ఇష్ట ఇష్టాలను కూడా తెలుసుకోలేదు తన పేరెంట్స్. తనకు అడిగే చనువు, స్వతంత్రం తండ్రి వద్ద లేదు. తల్లి ఆమాయకురాలు. 


తాంబూలాలు పుచ్చుకోవడం, పెళ్ళి జరిగిపోవడం అయిపోయింది. కనీసం నిశ్చితార్థం నాడు కూడా వరుడు రాలేదు. కోటి కోర్కెలు, ఆశలతో క్రొత్త పెళ్ళికూతురిగా గదిలోకి అడుగు పెట్టిన దీపకు మొదటి రాత్రే చేదు అనుభవం ఎదురైంది. " నీవంటే నాకు ఇష్టం లేదు. నేను వేరే అమ్మాయిని ప్రేమించాను. కేవలం పెద్దల కోరిక ప్రకారమే ఈ పెళ్ళి" అని బయటకు వెళ్ళి పోయిన భర్త మాటలకు అచేతనురాలై తలగడ తడిసేటట్టు కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఇంక చేసేది ఏమీలేక 'ఇదే జీవితం, కష్టమో, నష్టమో తుది వరకు ఇక్కడే గడపాలి కానీ పేరెంట్సు కు చెప్పి వాళ్ళను బాధ పెట్టగూడదు ' అని తన మనసును కుదుట పరుచుకుంది. 


కాపురానికి వెళ్ళిన రోజే ఆ ఇంటి మనుషులను, పరిస్థితులను అర్థంచేసుకోవటానికి ప్రయత్నించింది. పెద్ద ఉమ్మడి కుటుంబం, కట్టబాట్లు, మడులు, ఆచార -సాంప్రదాయాలు. అ‌త్తగారు, పినత్తగార్లు, పినమామగార్లు, తోటి కోడళ్ళు, బావగార్లు అందరూ 55 ఏళ్ళ పై వాళ్ళే. 17 ఏళ్ళ తను వాళ్ళందరికీ సపర్యలు, సేవలు చేస్తూ, అతిధి అభ్యాగతులతో అందరితో మంచిగా ఉంటూ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ కాలం గడుపుతోంది. అయినా అత్త- తోడికోడళ్ళ ఆరళ్ళు, కోరంటికం తప్పలేదు. వాళ్ళు దీపని ఏనాడూ ఇంటి కోడలుగా చూడలేదు, వంటమనిషి, పనిమనిషి గా భావించారు. "మొగుడికి లోకువైతే ఊరంతటికీ లోకువే" అన్న సామెత లాగా భర్త వాళ్ళందరి ముందే ప్రతి దానికీ అకారణంగా కొట్టటం, తిట్టడం. వాళ్ళకది వినోదం. భర్తకు ఇష్టం లేని పెళ్ళి కదా మరి. అయినా ఆన్నీ ఓర్చుకుంది దీప. 


కాలక్రమేణా ముగ్గురు ఆడ పిల్లలకు తల్లి అయింది. తండ్రి అయినా భర్త ప్రవర్తన లో మార్పు రాలేదు. ఉన్న ఆస్తితో ముగ్గురు పిల్లలను ఇంజనీర్లను చేసి, మంచి సంబంధాలు చూసి పెళ్ళిచేసింది. వాళ్ళు విదేశాల్లో స్ధిర పడ్డారు. అక్కడికే వెళ్ళి పురుళ్ళు పోసి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించింది దీప. 


నడివయసులో పడినా దీపకు శాడిస్టు భర్త బాధల నుంచి విముక్తి కలగలేదు సరికదా ఇప్పుడింకా రెచ్చిపోవటం పరిపాటి అయింది. తనతో అక్రమ సంబంధం ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఇంట్లోకి తెచ్చుకోవాలని దీపను విడాకులకు వత్తిడి చేయసాగాడు. అందుకు దీప ఒప్పుకోకపోవడంతో ఒంటి మీద వాతలు, ఇంట్లోనే వెలివేత, నిత్యం కొట్లు, తిట్లు పరిపాటి అయింది. సహనము, ఓర్పు ఆభరణాలనుకునే దీపకు ఇంక ఆ ఇంట్లో స్థానం కూడా లేకుండా చేస్తుంటే కన్న బిడ్డలకు తన పరిస్థితి చెప్పుకోక తప్పలేదు. వాళ్ళు చాలా బాధ పడి తండ్రికి నచ్చచెప్ప ప్రయత్నించి విఫలమైరి. మూర్ఖుడు ఎవరి మాటా వినడు కదా! అత్తారింటికి వెళ్లిన ఆడపిల్లలు అంతకన్నా ఏమి చేయగలరు?


ఇహ చేసేదేమీ లేక పిల్లలు తమ వద్దకు వచ్చి ఉండమన్నారు తల్లిని. ఇప్పటినుంచే వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళకు భారం కాదలచుకోలేక రానంది దీప. ఇంక నీ సమస్యను నీవే పరిష్కరించుకోమన్నారు పిల్లలు. ఇదే అదనుగా భావించి ' నీకు చిల్లిగవ్వకూడా నా ఆస్తి ఇవ్వను' అని తన స్వార్జిత ఆస్తిని ఆయనకు, పిల్లలకు వీలునామా రాసేసి కట్టుబట్టలతో ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు కసాయి భర్త. 


అప్పటిదాకా తన ఇల్లు, తన భర్త, తన పిల్లలు అనుకుంటూ 38 ఏళ్ళు బాధలు, కష్టాలు గడిపిన దీపకు భవిష్యత్తు అంథకార బంధురమైంది. ఒక స్కూలులో టీచరుగా చేరి ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని బ్రతుకు జీవనం సాగిస్తోంది. కానీ లోకులు కాకులు కదా! చుట్టుపక్కల అందరూ భర్త ను వదిలేసిందని రకరకాల నిందలు, గుసగుసలు, అవమానాలు. భర్త వదిలేసిన స్ర్తీ అంటే అందరికీ లోకువే కదా ! "మనసు ఎంత తేలికగా చేసుకుందామనుకున్నా నన్ను క్రుంగదీసే ఈ లోకానికి నా చిరునవ్వే సమాధానం " అని నిర్ణయించుకుని ధైర్యంగా ముందుకడుగు వేసి దగ్గరలో అనాథాశ్రమానికి వెళ్ళి వాళ్ళకు ఉచితంగా సేవ చేస్తోంది. "మానవ సేవే మాథవ సేవ అని తలచి స్కూలు వదిలాక ఎక్కువ సేపు అనాథాశ్రమంలోనే గడిపి తన గదికి చేరుతోంది. మధ్యమధ్యలో ప్రక్కనే దేవాలయానికి వెళ్ళి తనకు తోచిన సేవ చేస్తూ ఏటికి ఎదురీతగా జీవన పోరాటం సాగిస్తోంది దీప. 



.. సమాప్తం .. 


నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



నా గురించి పరిచయం.....


 నా పేరు  నీరజ  హరి ప్రభల. మాది  విజయవాడ. మావారు  రిటైర్డ్  లెక్చరర్. మాకు  ముగ్గురు  అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస.  వాళ్లు  ముగ్గురూ  సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా   విదేశాల్లో  ఉద్యోగాలు  చేస్తూ  భర్త, పిల్లలతో  సంతోషంగా ఉంటున్నారు. 


 నాకు  చిన్నతనం  నుంచి  కవితలు, కధలు  వ్రాయడం  చాలా  ఇష్టం. ఆరోజుల్లో  వాటిని  ఎక్కడికి,  ఎలా  పంపాలో  తెలీక  చాలా ఉండిపోయి  తర్వాత  అవి  కనుమరుగైనాయి.  ఈ  సామాజిక మాధ్యమాలు  వచ్చాక  నా రచనలను  అన్ని  వెబ్సైట్ లలో  వ్రాసి వాటిని పంపే  సౌలభ్యం  కలిగింది. నా కధలను, కవితలను  చదివి  చాలా  మంది పాఠకులు  అభినందించడం  చాలా  సంతోషదాయకం. 

నా కధలకు   వివిధ పోటీలలో  బహుమతులు  లభించడం,  పలువురి  ప్రశంసలనందుకోవడం  నా అదృష్టంగా  భావిస్తున్నాను. 


మన  సమాజంలో  అనేక  కుటుంబాలలో   నిత్యం  జరిగే  సన్నివేశాలు, పరిస్థితులు,   వాళ్లు  పడే  బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని   ఎదుర్కొనే  తీరు   నేను  కధలు వ్రాయడానికి  ప్రేరణ, స్ఫూర్తి.  నా కధలన్నీ  మన  నేటివిటీకి, వాస్తవానికి   దగ్గరగా ఉండి  అందరి  మనస్సులను  ఆకర్షించడం  నాకు  సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న  దారుణాలకు, పరిస్ధితులకు   నా మనసు  చలించి  వాటిని  కధల రూపంలోకి  తెచ్చి  నాకు  తోచిన  పరిష్కారం  చూపే  ప్రయత్నం  చేస్తాను.   


నా  మనసులో  ఎప్పటికప్పుడు  కలిగిన  భావనలు, అనుభూతులు, మదిలో  కలిగే  సంఘర్షణలను   నా కవితలలో  పొందుపరుస్తాను. నాకు  అందమైన  ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర  నైసర్గిక  స్వరూపాలను  దర్శించడం, వాటిని  ఆస్వాదించడం, వాటితో  మమేకమై మనసారా  అనుభూతి చెందడం  నాకు  చాలా ఇష్టం. వాటిని  నా హృదయకమలంలో  అందంగా  నిక్షిప్తం చేసుకుని   కవితల రూపంలో  మాలలుగా  అల్లి  ఆ  అక్షర మాలలను  సరస్వతీ దేవి  పాదములవద్ద  భక్తితో   సమర్పిస్తాను.  అలా  నేను  చాలా  దేశాల్లలో  తిరిగి  ఆ అనుభూతులను, అనుభవాలను   నా కవితలలో, కధలలో  పొందుపరిచాను. ఇదంతా  ఆ వాగ్దేవి  చల్లని  అనుగ్రహము. 🙏 


నేను గత  5సం… నుంచి  కధలు, కవితలు  వ్రాస్తున్నాను. అవి  పలు పత్రికలలో  ప్రచురణలు  అయ్యాయి. పుస్తకాలుగా  ప్రచురించబడినవి. 


“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో  నేను కధలు, కవితలు   వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో   నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు  లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు   రవీంద్రభారతిలో  నాకు  “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి  ఘనంగా  సన్మానించడం  నా జీవితాంతం  మర్చిపోలేను. ఆజన్మాంతం  వాళ్లకు  ఋణపడిఉంటాను.🙏 


భావుక  వెబ్సైట్ లో  కధల పోటీలలో   నేను  వ్రాసిన “బంగారు గొలుసు” కధ   పోటీలలో  ఉత్తమ కధగా  చాలా ఆదరణ, ప్రశంసలను  పొంది  బహుమతి  గెల్చుకుంది. ఆ తర్వాత  వివిధ పోటీలలో  నా కధలు  సెలక్ట్  అయి  అనేక  నగదు  బహుమతులు  వచ్చాయి.  ‘మన కధలు-మన భావాలు’  వెబ్సైట్ లో  వారం వారం  వాళ్లు  పెట్టే  శీర్షిక, వాక్యానికి కధ,    ఫొటోకి  కధ, సందర్భానికి  కధ  మొ… ఛాలెంజ్  లలో  నేను   కధలు వ్రాసి  అనేకమంది  పాఠకుల  ప్రశంశలను  పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్  వెబ్సైట్ లో  “పశ్చాత్తాపం” అనే  నా  కధకు  విశేష స్పందన  లభించి  ఉత్తమ కధగా  సెలక్ట్ అయి  నగదు బహుమతి   వచ్చింది. ఇలా  ఆ వెబ్సైట్ లో  నెలనెలా   నాకధలు  ఉత్తమ కధగా  సెలెక్ట్ అయి  పలుసార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి.



ఇటీవల నేను  వ్రాసిన  “నీరజ  కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు”  75 కవితలతో  కూడిన పుస్తకాలు  వంశీఇంటర్నేషనల్   సంస్థ వారిచే  ప్రచురింపబడి  మా గురుదంపతులు  ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి  అవార్డీ    శ్రీ  అయ్యగారి శ్యామసుందరంగారి  దంపతులచే  కథలపుస్తకం,  జాతీయకవి  శ్రీ సుద్దాల అశోక్ తేజ  గారిచే   కవితలపుస్తకం  రవీంద్ర భారతిలో ఘనంగా  ఆవిష్కరించబడటం,  వాళ్లచేత  ఘనసన్మానం  పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు  పొందడం  నాఅదృష్టం.🙏 


ఇటీవల  మన  మాజీ ఉపరాష్ట్రపతి  శ్రీ  వెంకయ్యనాయుడి గారిచే  ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు  అందుకోవడం  నిజంగా  నా అదృష్టం. పూర్వజన్మ  సుకృతం.🙏


చాలా మంది  పాఠకులు  సీరియల్ వ్రాయమని కోరితే  భావుకలో  “సుధ” సీరియల్  వ్రాశాను. అది  అందరి ఆదరాభిమానాలను  పొందటమే  కాక   అందులో  సుధ  పాత్రని  తమ ఇంట్లో పిల్లగా  భావించి  తమ  అభిప్రాయాలను  చెప్పి  సంతోషించారు. ఆవిధంగా నా  తొలి సీరియల్  “సుధ”  విజయవంతం అయినందుకు  చాలా సంతోషంగా  ఉన్నది.        


నేను వ్రాసిన  “మమతల పొదరిల్లు”  కధ భావుకధలు  పుస్తకంలో,  కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో  “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో  కొత్తకెరటం   పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి”   పుస్తకంలో  ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు  పుస్తకాలుగా  వెలువడి  బహు  ప్రశంసలు  లభించాయి. 


రచనలు  నా ఊపిరి. ఇలా పాఠకుల  ఆదరాభిమానాలు, ఆప్యాయతలే  నాకు  మరింత  రచనలు  చేయాలనే  ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది  శ్వాస వరకు  మంచి రచనలు  చేయాలని, మీ అందరి  ఆదరాభిమానాలను  పొందాలని  నా ప్రగాఢవాంఛ. 


ఇలాగే  నా రచనలను, కవితలను  చదివి  నన్ను   ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని   ఆశిస్తూ 


                     మీ  అభిమాన రచయిత్రి

                       నీరజ హరి  ప్రభల.

                          విజయవాడ.

Photo Gallery




53 views0 comments

Comments


bottom of page